చోరీకి పాల్పడిన ఆటో డ్రైవర్‌ అరెస్టు

ABN , First Publish Date - 2020-03-21T10:05:14+05:30 IST

బంగారు ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగ్‌ను దొంగిలించిన ఆటో డ్రైవర్‌ను నేరేడ్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

చోరీకి పాల్పడిన ఆటో డ్రైవర్‌ అరెస్టు

నగలు, నగదు స్వాధీనం


నేరేడ్‌మెట్‌, మార్చి20 (ఆంధ్రజ్యోతి) : బంగారు ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగ్‌ను దొంగిలించిన ఆటో డ్రైవర్‌ను నేరేడ్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండమండలం, పోతేపల్లి గ్రామ పరిధిలోని ఎంజీ కాలనీ తండాకు చెందిన ముదావత్‌ పెంట్యా(25) నగరంలోని పహడీషరీ్‌ఫలోని రంగనాయక కాలనీలో నివాసముంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నేరేడ్‌మెట్‌లోని కాకతీయనగర్‌లో నివాసముండే కిషోర్‌కుమార్‌(38) తల్లిదండ్రులతో కలిసి గతవారం బెంగళూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి ఈ నెల 16న హెదరాబాద్‌కు వస్తూ లక్డీకాపూల్‌లో బస్సు దిగాడు. అక్కడ ముదావత్‌ పెంట్యా ఆటోను అద్దెకు తీసుకుని కాకతీయనగర్‌కు వచ్చాడు. కిషోర్‌కుమార్‌ తండ్రికి పక్షవాతం ఉన్నందున ఆటో దిగిన తరువాత తల్లిదండ్రులను ముందుగా ఇంట్లో వదిలి వచ్చాడు.


ఆ తర్వాత కిషోర్‌కుమార్‌ రెండు బ్యాగ్‌లను తీసుకొని ఇంట్లోకి వెళ్లాడు. ఇదే సమయంలో ఆటో డ్రైవర్‌ పెంట్యా నగలు, నగదు ఉన్న బ్యాగ్‌ను తీసుకుని ఆటో అద్దె డబ్బులు తీసుకోకుండానే పరారయ్యాడు. దీంతో కిషోర్‌కుమార్‌ వెంటనే నేరేడ్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా ఆటోను గుర్తించిన పోలీసులు శుక్రవారం ఆటో డ్రైవర్‌ పెంట్యాను అరెస్టు చేసి అతని నుంచి 10.8 గ్రాముల బంగారు ఆభరణాలు, 9 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహస్వామి తెలిపారు. 

Updated Date - 2020-03-21T10:05:14+05:30 IST