మరో 33 బస్తీ దవాఖానాలు
ABN , First Publish Date - 2020-07-06T09:51:39+05:30 IST
పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వ ప్రాథమిక వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు మరో 33 బస్తీ దవాఖానాలను ఏర్పాటు
హైదరాబాద్ సిటీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వ ప్రాథమిక వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు మరో 33 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో నగరంలో బస్తీ దవాఖానాల సంఖ్య 200లకు చేరనుంది. ఈ బస్తీ దవాఖానాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమించనుండగా, జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చూడనుంది. గ్రేటర్ పరిధిలో గత ఏడాది 123 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది మే 22న మరో 44 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి వార్డుకు కనీసం రెండు చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా ప్రస్తుతం 33 బస్తీ దవాఖానాలకు అవసరమైన వసతి సౌకర్యాలను కల్పించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకే్షకుమార్ తెలిపారు.