ఐదు నిమిషాలు దాటితే.. రూ.100 జరిమానా
ABN , First Publish Date - 2020-07-22T10:01:32+05:30 IST
ఐదు నిమిషాల నిబంధనతో క్యాబ్ డ్రైవర్లను నిలువునా దోచుకుంటున్నారు. ప్రయాణికులను దించడానికి శంషాబాద్
ఎయిర్పోర్టు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొత్త నిబంధన
ఆందోళన వ్యక్తం చేస్తున్న క్యాబ్ డ్రైవర్లు
హైదరాబాద్ జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఐదు నిమిషాల నిబంధనతో క్యాబ్ డ్రైవర్లను నిలువునా దోచుకుంటున్నారు. ప్రయాణికులను దించడానికి శంషాబాద్ ఎయిర్పోర్టులోని ర్యాంపు ఎక్కితే ఐదు నిమిషాల్లో వచ్చేయాలి. లేకపోతే రూ. 100 జరిమానా చెల్లించాల్సిందే. ఇదే పరిస్థితి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా ఉందని క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వల్ల క్యాబ్లు సాఫీగా నడిచే పరిస్థితి లేదు. ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్లకు వెళ్లితే ఐదు నిమిషాలు దాటితే వంద రూపాయలు జరిమానా వసూలు చేస్తున్నారని క్యాబ్ డ్రైవర్లు వాపోతున్నారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లిన ప్రయాణికులు సామాన్లు దించుకోవడం, తమ వస్తువులను తనిఖీ చేసుకోవడం, కిరాయి చెల్లించడానికి 5-10 నిమిషాల సమయం పడుతుంది.
ఎయిర్పోర్టు అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా ర్యాంప్ పైకి ఎంట్రీ అయిన సమయాన్ని పరిగణనలోకి తీసుకొని 5 నిమిషాలు దాటితే ఎగ్జిట్ గేటు వద్ద ఆలస్యానికి రూ. 100 వసూలు చేయడంతో తాము ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని తెలంగాణ రాష్ట్ర ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు షేక్ సల్లావుద్దీన్ తెలిపారు. క్యాబ్ల నుంచి ప్రయాణికులు దిగే సమయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కొత్తగా తీసుకువచ్చిన ఈ నిబంధనతో వందలాది మంది క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్లకు వెళ్లడానికి బుకింగ్లు వస్తే క్యాబ్ డ్రైవర్లు వెనకడుగు వేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ల ఇబ్బందులను ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ అధికారులు పట్టించుకోకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. యాప్ కంపెనీలు సైతం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని డ్రైవర్లు అంటున్నారు. ఎయిర్పోర్టు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల వద్ద అమలు చేస్తున్న ఐదు నిమిషాల నిబంధనలో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారు.