విస్తరిస్తోన్న కరోనా..
ABN , First Publish Date - 2020-05-17T11:01:27+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్లో శనివారం 44 కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా బారిన పడిన పలువురిని ఆస్పత్రికి తరలించారు.
![విస్తరిస్తోన్న కరోనా..](https://media.andhrajyothy.com/appimg/galleries/20200517251/05172020053115n41.jpg)
శనివారం 44 కేసులు
మంగళ్హాట్/అబిడ్స్/ఎర్రగడ్డ/చందానగర్/అంబర్పేట/మెహిదీపట్నం/ఎల్బీనగర్/ కొత్తపేట/చిక్కడపల్లి, మే 16(ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్లో శనివారం 44 కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా బారిన పడిన పలువురిని ఆస్పత్రికి తరలించారు. సీతారాంబాగ్లో నివాసం ఉండే కూరగాయల షాపు నిర్వాహకురాలు(72)కు వైరస్ నిర్ధారణ అయింది.
కింగ్కోఠి జిల్లా ఆస్పత్రిలో ఏడుగురు..
కింగ్కోఠి జిల్లా ఆస్పత్రిలో తాజాగా ఏడుగురికి వైరస్ నిర్ధారణ కాగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. కింగ్కోఠి జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం 19 మంది అనుమానితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
ఆయుర్వేద ఆస్పత్రిలో 20మందికి..
ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రిలో ఉన్న అనుమానితుల్లో 20 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరో 60మందికి నెగెటివ్ రావడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. 40మంది అనుమానితుల ఫలితాలు రావాల్సి ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పరమేశ్వర్ నాయక్ తెలిపారు.
కామన్ బాత్రూమ్తో మరో 8మందికి..
మంగళ్హాట్లో కామన్ బాత్రూమ్ వినియోగించిన వారిలో తాజాగా మరో 8 మందికి వైరస్ నిర్ధారణ అ యింది. ఇప్పటివరకు కామాటిపురా ప్రాంతంలో నివాసం ఉండే 24 మందికి కరోనా సోకింది. వారందరికీ ఎర్రగడ్డ ఆయుర్వేదిక్, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
మంగళ్హాట్లో స్వీపర్కు..
మంగళ్హాట్లోని శివ్లాల్నగర్లో నివాసం ఉండే మహిళ(55) లక్డీకాఫూల్లోని ఓ ప్రభుత్వ సంస్థలో స్వీపర్గా పనిచేస్తోంది. ఈ నెల 13న ఆమె అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించారు. శనివారం అందిన రిపోర్ట్స్లో ఆమెకు వైరస్ నిర్ధారణ అయింది.
చెస్ట్ ఆస్పత్రిలో ఒకరికి..
ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రిలో 6 కరోనా కేసులకు చికిత్సలు అందిస్తున్నారు. అందులో ఒకటి పాజిటివ్, 5 అనుమానిత కేసులు ఉన్నాయి. గతంలో అనుమానిత కేసులుగా ఉన్న 11 మందికి నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టరు మెహబూబ్ఖాన్ తెలిపారు.
చందానగర్ సర్కిల్లో మహిళకు..
చందానగర్లో ఓ మహిళకు పాజిటివ్ వచ్చిందని సర్కిల్ ఉపకమిషనర్ సుదాంష్ తెలిపారు. జవహర్కాలనీ రోడ్ నెం-3లో నివాసం ఉండే మహిళను శుక్రవారం ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పతికి తరలించి పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. ఆ కుటుంబంలో ఏడుగురిని క్వారంటైన్కి పంపించామని చెప్పారు.
అంబర్పేటలో వ్యక్తికి..
అంబర్పేటలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. గోల్నాక అశోక్నగర్లో నివాసం ఉండే ఓ వ్యక్తి(39)కి ఫీ వర్ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిం ది. దీంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మద్యం షాపు వద్ద ఆయనకు వైరస్ సోకిందా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అతని కుటుంబ సభ్యు లు, కిరాయికి ఉంటున్న వ్యక్తి, చుట్టుపక్కల ఉండే ఇద్దరు వ్యక్తులను కలిపి 9మందిని వైద్య పరీక్షల కరోసం నేచర్క్యూర్ ఆస్పత్రికి తరలించారు.
చైతన్యపురిలో ఇద్దరికి..
చైతన్యపురి డివిజన్లోని సత్యనారాయణ పురానికి చెందిన ఓ మహిళ (40)కు పాజిటివ్ వచ్చింది. బుధవారం ఇదే ప్రాంతానికి చెందిన మహిళ(48)కు పాజిటివ్ వచ్చిన విషయం విదితమే. ఆమెకు పాజిటివ్ రావడంతో ఆమె భర్తతో పాటు అదే ఇంట్లో ఉండే కిరాయిదారులను కూడా హోం క్వారెంటైన్లో ఉంచారు.
బాగ్లింగంపల్లిలో మహిళకు..
చిక్కడపల్లి పోలీ్సస్టేషన్ పరిధిలోని బాగ్లింగంపల్లిలో శనివారం ఓ మహిళకు వైరస్ నిర్ధారణ అయింది. ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్లో నివసించే గృహిణి(32) శుక్రవారం ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంది. పాజిటివ్ రావడంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులు ముగ్గురిని క్వారంటైన్ నిమిత్తం బల్కంపేట్ నేచర్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు. వారి ఇంటిని కంటైన్మెంట్ చేశారు.
మన్సూరాబాద్లో కానిస్టేబుల్కు..
మన్సూరాబాద్ డివిజన్ శ్రీరామహిల్స్ కాలనీలో ఉండే పోలీస్ కానిస్టేబుల్(33)కు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
‘సరోజినీ’ ఐసోలేషన్ వార్డు ఖాళీ
కరోనాలో భాగంగా మెహిదీపట్నం సరోజినీదేవి ప్రభుత్వ కంటి ఆస్పత్రిలో 150 పడకల ఐసోలేషన్ వార్డు శనివారం ఖాళీ అయింది. మూడు రోజుల క్రితం 147 మం ది ఉండగా, శుక్రవారం 39 మందే ఉన్నారు. వారిని కూడా ఇళ్లకు పంపించినట్లు డాక్టర్ అనురాధ తెలిపారు. శనివారం ఐసోలేషన్లోఎవరూ చేరలేదని తెలిపారు.