లాటరీ పేరుతో నగరవాసికి రూ.1.18 లక్షల టోకరా

ABN , First Publish Date - 2020-03-24T09:49:21+05:30 IST

స్నాప్‌డీల్‌ బంపర్‌డ్రా పేరుతో దోపిడీ చేస్తున్న సైబర్‌ మోసగాడికి సహకరించిన వ్యక్తిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు.

లాటరీ పేరుతో నగరవాసికి రూ.1.18 లక్షల టోకరా

సైబర్‌ మోసగాడికి సహకరించిన వ్యక్తి అరెస్ట్‌


హైదరాబాద్‌ సిటీ, మార్చి23 (ఆంధ్రజ్యోతి): స్నాప్‌డీల్‌ బంపర్‌డ్రా పేరుతో దోపిడీ చేస్తున్న సైబర్‌ మోసగాడికి సహకరించిన వ్యక్తిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. మాసబ్‌ట్యాంక్‌ ప్రాంతానికి చెందిన కె.విక్రమ్‌ స్నాప్‌డీల్‌లో చేతి గడియారాన్ని కొన్నాడు. వాచ్‌ డెలివరీ అయిన తర్వాత అతడి మొబైల్‌కు స్నాప్‌డీల్‌ బంపర్‌డ్రాలో రూ.12.50 లక్షల విలువైన టాటా స్ట్రోమ్‌ వాహనం గెలుచుకున్నట్లు మెసేజ్‌ వచ్చింది. అనంతరం అతడికి ఫోన్‌ చేసిన సైబర్‌ మోసగాళ్లు రిజిస్ట్రేషన్‌ ఖర్చులకు కేవలం రూ.4,600 చెల్లిస్తే వాహనం ఇస్తామని ఆశ చూపారు. ఆ డబ్బులు జమచేసిన తర్వాత జీఎ్‌సటీ చార్జీలు, ఐటీ చార్జీలు, ఆర్‌బీఐ చార్జీల పేరుతో పలు దఫాలుగా అతడి నుంచి రూ.1,18,900 వసూలు చేశారు.


అనంతరం ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతో బాధితుడు జనవరి నెలలో సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించిన సైబర్‌ క్రైం సిబ్బంది.. బిహార్‌ ఖగారియా జిల్లా సోహౌలి ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి సురే్‌షకుమార్‌(30)ను అరెస్ట్‌ చేశారు. ఇతడు సైబర్‌ మోసాలు చేసే తన స్నేహితుడు విద్యుత్‌ మండల్‌కు ఖాతా వివరాలు ఇచ్చాడు. తన ఖాతాలో జమ అయిన డబ్బులు అతడికి అందించేవాడు. ఈ విధంగా సైబర్‌ మోసగాడికి సహాయం చేస్తున్న నిందితుడిని సైబర్‌ క్రైం సిబ్బంది అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2020-03-24T09:49:21+05:30 IST