లాక్డౌన్ ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 1014 ఆటోల సీజ్
ABN , First Publish Date - 2020-03-24T16:24:22+05:30 IST
లాక్డౌన్ సమయంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలని, లేకుంటే వాహనాలను సీజ్ చేస్తామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ హెచ్చరించారు.

అకారణంగా రాత్రి వేళ బయటకొస్తే కఠిన చర్యలు
రాచకొండ సీపీ మహేష్ భగవత్
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ సమయంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలని, లేకుంటే వాహనాలను సీజ్ చేస్తామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ హెచ్చరించారు. జనతా కర్ఫ్యూ సమయంలో సంయమనంతో ఇళ్లలో ఉన్నవాళ్లు సోమవారం ఉదయం రోడ్లపైకి వచ్చారు. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ఇచ్చిన వెసులుబాటును దుర్వినియోగం చేసి రోడ్లపై తిరగడం ప్రారంభించారు. ఇలా చేయడం వల్ల జనతా కర్ఫ్యూ ప్రకటించినా, లాక్డౌన్ విధించినా ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సరైన కారణం లేకుండా ద్విచక్రవాహనాలపై తిరుగుతున్న వారి వాహనాలను, ప్యాసింజర్లను తీసుకెళ్తున్న ఆటోలను కూడా సీజ్ చేశామన్నారు. సాయంత్రం 6.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ రోడ్లపై ఎలాంటి వాహనాలకు అనుమతిలేదని, సరైన కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన కార్లు, బైకులు, ఆటోలను సీజ్ చేస్తామని ట్రై కమిషనరేట్ సీపీలు హెచ్చరించారు.