పట్టు బిగిస్తున్న పార్టీలు
ABN , First Publish Date - 2020-12-29T05:07:14+05:30 IST
ఆదిలాబాద్రూరల్ మండల జడ్పీటీసీ ఎన్నికపై కసరత్తు మొదలు కావడంతో ప్రధాన పార్టీలు మరింత పట్టుబిగిస్తున్నాయి. జడ్పీ వైస్ చైర్మన్ ఆరే రాజన్న కరోనా బారిన పడి మృతి చెందగా ఆ స్థానం ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, ఎన్నిక నిర్వహించాలని ఇప్పటికే అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. దీంతో త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం కనిపిస్తోంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రధాన పార్టీలన్నీ హడావిడి చేస్తున్నాయి.
ఆదిలాబాద్ జడ్పీటీసీ ఎన్నికపై మొదలైన కసరత్తు
అభ్యర్థిని ప్రకటించిన అధికార టీఆర్ఎస్ పార్టీ
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలు
కాంగ్రెస్ నేతల్లో కనిపించని కదలిక
తాంసి, జైనథ్, బేల జడ్పీటీసీలలో ఒకరికి వైస్ చైర్మన్ అవకాశం?
ఆదిలాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్రూరల్ మండల జడ్పీటీసీ ఎన్నికపై కసరత్తు మొదలు కావడంతో ప్రధాన పార్టీలు మరింత పట్టుబిగిస్తున్నాయి. జడ్పీ వైస్ చైర్మన్ ఆరే రాజన్న కరోనా బారిన పడి మృతి చెందగా ఆ స్థానం ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, ఎన్నిక నిర్వహించాలని ఇప్పటికే అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. దీంతో త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం కనిపిస్తోంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రధాన పార్టీలన్నీ హడావిడి చేస్తున్నాయి. ఇప్పటికే మండలాన్ని ఒకటి రెండు సార్లు చుట్టేసిన ప్రధాన పార్టీల నేతలు గెలుపు అవకాశాలను అంచనా వేసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ నేతలు జడ్పీటీసీ ఎన్నికను సవాలుగా తీసుకుంటున్నారు. ఎలాగైనా గెలిచి జడ్పీ పాలనలో చక్రం తిప్పాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ఆదిలాబాద్ మండల జడ్పీటీసీ ఎన్నిక ను నిర్వహించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉండడంతో ప్రధాన పార్టీలన్ని గెలిచేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇదిలా ఉండగా మరికొంత మంది స్వతంత్య్ర అభ్యర్థులు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.
అభ్యర్థి ఖరారులో ముందున్న టీఆర్ఎస్..
జడ్పీటీసీ ఎన్నిక రావడం ఖాయమని తెలిసిపోవడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే అభ్యర్థిని ప్రకటించింది. జడ్పీ వైస్ చైర్మన్ ఆరే రాజన్న తనయుడు నరేష్ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేస్తూ ఎమ్మెల్యే జోగు రామన్న అధికారిక ప్రకటన చేశారు. అభ్యర్థి గెలుపును నిర్ణయించే గ్రామాలలో చాందా(టి) ప్రధానం కావడంతో అక్కడి నుంచే అభ్యర్థిని దింపేందుకు టీఆర్ఎస్ సిద్ధమయ్యింది. ఆరే రాజన్న కుటుంబం నుంచి అభ్యర్థిని ఖరారు చేయడం పట్ల రాజకీయ ఎత్తుగడ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో సానుభూతితో పాటు పార్టీ పట్ల విశ్వాసాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో బీజేపీ పార్టీ తరఫున జడ్పీటీసీగా పోటీచేసి ఓటమి పాలైన దారుట్ల జీవన్ కారు పార్టీలో చేరిపోయినా ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో ఆ పార్టీలోనే కొనసాగుతారా తిరిగి కమలం పార్టీ గూటికే చేరిపోతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పాయల తనయుడి వైపే మొగ్గు..
ఇన్నాళ్లు బీజేపీలో ఎంపీ సోయం బాపూరావు తనయుడు సోయం వెంకటేశ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ తనయుడు బన్నీ మధ్యలో పోటీ కనిపించినా పాయల శంకర్ తనయుడి వైపే మొగ్గు కనిపిస్తోలంది. పార్టీ క్యాడర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీ టీసీలు బన్నీ అభ్యర్థిత్వాన్నే ఖరారు చేయాలని పట్టుబడు తున్నారు. సోయం వెంకటేశ్ జడ్పీటీసీ బరిలో ఉంటారని బలంగా ప్రచారం జరిగినా పార్టీ శ్రేణుల అభిప్రాయానికి అనుగుణంగా బన్నీని బరిలో దింపే అవకాశం కనిపిస్తోంది. పాయల శంకర్ సొంత నియోజకవర్గం కావడంతో భవిష్యత్తులో ఆయనకు కలిసివచ్చే అవకాశం ఉందం టు న్నారు. ప్రస్తుత అడ సర్పంచ్ బన్నీని బరిలో దింపాలనే భావనతో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. గెలుపును నిర్ణయించే చాందా (టి), యాపల్గూడ, పొచ్చెర, లాండసాంగి గ్రామాల్లో బీజేపీ క్యాడర్ బలంగా ఉండడంతో పాటు ఆదివాసీల ఓట్లు కలిసి వస్తాయనే భావనతో బీజేపీ నేతలు కనిపిస్తున్నారు. పాయల శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అధికారికంగా బన్నీ అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం ఉంది.
నామమాత్రంగానే కాంగ్రెస్లో పోటీ..
ఆదిలాబాద్ జడ్పీడీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నామ మాత్రంగానే ప్రభావం చూపే అవకాశం ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తు న్నాయి. వరుస ఓటమిలతో పూర్తిగా డీలా పడిపోయిన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మండలంలో అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. సోమవారం కొండ గంగాధర్ను కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఆ పార్టీలో పోటీ చేసేందుకు మరెవరూ ముందుకు రాకపోవడంతో కొండ గంగాధర్ పేరునే ప్రకటించారు. అయితే అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు దీటైన అభ్యర్థిని ప్రకటించ లేదన్న అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీల్లో వ్యక్తమవుతున్నాయి.
రామన్న పక్కా ప్లాన్..
ఆదిలాబాద్ జడ్పీటీసీ ఎన్నికలపై ఎమ్మెల్యే జోగు రామన్న పక్కా ప్లాన్తో ముందు కెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆరే రాజన్న కుటుంబం నుంచి అభ్యర్థిని దింపి సానుభూతి పొందడంతో పాటు బయట నుంచి మద్దతు తీసుకోవాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్థికంగా తీవ్రంగా నష్ట పోయిన రాజన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు జడ్పీ వైస్ చైర్మన్ పదవిని ఎరగా వాడుకునే అవకాశం కనిపిస్తోంది. ముందు నుంచి జడ్పీ వైస్ చైర్మన్ రేసులో ఉన్న తాంసి, జైనథ్, బేల జడ్పీటీసీలపై ఆదిలాబాద్ జడ్పీటీసీ స్థానాన్ని గెలిపించే బాధ్యతలను అప్పగిం చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తన సొంత నియోజక వర్గంలోని బేల జడ్పీటీసీ వైపే జోగు రామన్న మొగ్గు చూపుతున్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జడ్పీటీసీ ఎన్నికల్లో అయ్యే ఖర్చులను భరించిన వారికే వైస్ చైర్మన్ పదవిని ఇచ్చేందుకు అంతర్గతంగా ఒప్పందం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తానికి జడ్పీటీసీ స్థానం మళ్లీ టీఆర్ఎస్ ఖాతాలోనే పడితే వైస్ చైర్మన్ పదవిని బేల జడ్పీటీసికి కట్టబెట్టేందుకు అధికార పార్టీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.