మంచిర్యాల జిల్లాలో పెరిగిన భూముల రిజిస్ట్రేషన్లు
ABN , First Publish Date - 2020-12-31T04:27:06+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వం ఓపెన్ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులేషన్ స్కీం)ను రద్దు చేయడంతో జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి.

- తొలి రోజు 85 డాక్యుమెంట్లు పూర్తి
మంచిర్యాల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): టీఆర్ఎస్ ప్రభుత్వం ఓపెన్ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులేషన్ స్కీం)ను రద్దు చేయడంతో జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే డాక్యుమెంటేషన్ పూర్తయిన వ్యవసాయేతర ఓపెన్ ప్లాట్లకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ను సీఎం కేసీఆర్ ఈ నెల 29న రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆగమేఘాల మీద పాత రిజిస్ట్రేషన్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద బారులు తీరారు. ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ముందుకు కదలని రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం ఒక్కసారిగా అమాంతం పెరిగిం ది. జిల్లాలో మంచిర్యాల, లక్షెట్టిపేటలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా రెండు చోట్ల జన సందోహం కనిపింది. మంచిర్యాలలో తొలి రోజు 80 మంది రిజిస్ట్రేషన్ల దరఖాస్తు చేసుకోగా, సాయంత్రం వరకు 60 పూర్తయ్యాయి. మిగిలిన వాటిని కూడా పూర్తి చేయనున్నట్లు ఎస్ఆర్వో రవికాంత్ తెలిపారు. అలాగే లక్షెట్టిపేటలో ఐదు రిజిస్ట్రేషన్లు చేశారు. కాగా మంచిర్యాల కార్యాలయంలో రూ. 35 లక్షల ఆదాయం రాగా, లక్షెట్టిపేటలో రూ. 34 వేల పైచిలుకు ఆదాయం సమకూరింది.