ఉట్నూర్లో కొనసాగుతున్న లాక్డౌన్
ABN , First Publish Date - 2020-06-06T11:14:04+05:30 IST
కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు సడలించగా.. ముంబాయి నుంచి వచ్చిన వలస కార్మికులతో మండలంలో కరోనా
ఉట్నూర్, జూన్ 5: కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు సడలించగా.. ముంబాయి నుంచి వచ్చిన వలస కార్మికులతో మండలంలో కరోనా కేసులు పెరిగాయి. దీంతో అధికార యంత్రాంగం గురువారం నుంచి లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఉట్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శాంతినగర్లో ఐదు, బోయవాడలో ఒకటి, లక్కారం గ్రామ పంచాయతీ పరిధిలోని నవోదయనగర్లో మూడు కరోనా కేసులు వెలుగు చూడడంతో అధికారులు తొమ్మిది మందిని జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించారు.
కరోనా నియంత్రణ కోసం అధికార యంత్రాంగం అంతంత మాత్రమే చర్యలు చేపడుతూ ప్రజలు స్వచ్ఛంధంగా స్వీయ నియంత్రణ పాటించాలని చేతులు దులుపుకుంటోంది. ఫలితంగా ఇంకా ఏజెన్సీ ప్రాంతంలో కొత్త కేసులు వచ్చే అవకాశాలు ఉంటాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నా రు. ఉట్నూర్ పట్టణంలో రెండు రోజులుగా లాక్డౌన్ కొనసాగుతుండడంతో అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. ఉట్నూర్ డిపో నుంచి మాత్రం ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నప్పటికీ ఉట్నూర్ ప్రజలు పూర్తిగా రాకపోకలు నిలిపి వేసుకున్నారు.