నో ట్యాగ్‌.. నో ఎంట్రీ

ABN , First Publish Date - 2020-12-28T06:04:11+05:30 IST

జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద వాహ నాల రద్దీని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ‘నో ట్యాగ్‌.. నో ఎంట్రీ’కి శ్రీకారం చుట్టింది. ప్రతీరోజు టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది.

నో ట్యాగ్‌.. నో ఎంట్రీ
సోన్‌ మండలంలోని గంజాల్‌ టోల్‌ప్లాజా

జనవరి 1నుంచి టోల్‌ప్లాజాల వద్ద ట్యాగ్‌ నిబంధనలు 

అమలు కానున్న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు 

అవగాహన కల్పిస్తున్న ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది

ఇక నుంచి నగదు చెల్లింపులు రద్దు

ఫాస్ట్‌ ట్యాగ్‌ ఉంటేనే అనుమతి

వాహనాల రద్దీని నివారించడానికి చర్యలు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నాలుగు టోల్‌ ప్లాజాలు

సోన్‌, డిసెంబరు 27: జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద వాహ నాల రద్దీని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ‘నో ట్యాగ్‌.. నో ఎంట్రీ’కి శ్రీకారం చుట్టింది. ప్రతీరోజు టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. అయితే, 2021 జనవరి 1వ తేదీ నుంచి ఫాస్ట్‌ ట్యాగ్‌ నిబంధనలను అమలు చేయడానికి నిర్ణయించారు. నగదు చెల్లింపులకు వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మారుతున్న కాలానుగుణంగా వాహనాల రద్దీని నివారించడానికి ఫాస్ట్‌ ట్యాగ్‌ పద్ధతిని పకడ్బందీగా అమలు చేయడానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం నాలుగు టోల్‌ప్లాజాలు ఉండగా.. నిర్మల్‌ జిల్లాలో సోన్‌ మండలం గంజాల్‌ వద్ద, దిలావర్‌పూర్‌ మండలకేంద్రంలో మరొకటి, అలాగే ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ వద్ద, పిప్పల్‌కోటి వద్ద మరొక టోల్‌ప్లాజా ఉన్నాయి. ఇవి నేషనల్‌ హైవే అథారటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ ఏఐ) సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. కాగా, సోన్‌ మండలం గంజాల్‌ టోల్‌ప్లాజా గుండా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ప్రస్తు తం అత్యవసర పరిస్థితుల్లో సైతం టోల్‌ప్లాజా వద్ద నగదు చెల్లింపు కోసం గం టల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. నగదు చెల్లింపులకు చెక్‌ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ ట్యాగ్‌ పద్ధతిని అమలు చేస్తూ ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బందిని అప్ర మత్తం చేశారు. దీంతో ఫాస్ట్‌ ట్యాగ్‌ లేని వాహనాలను టోల్‌ప్లాజా వద్ద అనుమ తిని నిరాకరించడం జరుగుతుంది. ఫాస్ట్‌ ట్యాగ్‌ ఉన్న వాహనాల డబ్బులు టోల్‌ ప్లాజా వద్ద బదిలీ కావడం జరుగుతుంది. ఫాస్ట్‌ ట్యాగ్‌తో వెళ్లేవారి డబ్బులు టోల్‌ప్లాజా వద్ద ఆన్‌లైన్‌లో బదిలీ కావడం జరుగుతుంది. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏ ఐ సిబ్బంది గ్రామాల్లో ప్రచారం నిర్వహించడంతో పాటు పాస్ట్‌ ట్యాగ్‌ గురించి గతనెల రోజుల నుంచి అవగాహన కల్పిస్తున్నారు. పాస్ట్‌ ట్యాగ్‌ విధానం అమ లుతో ప్రతీరోజు గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద ఏడు వేలమంది రాకపోకలు జరుపగా, మూడు వేల వాహనాలు నగదు చెల్లింపుతో ప్రయాణించనున్నట్లు  సిబ్బం ది తెలిపారు. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న ఫాస్ట్‌ ట్యాగ్‌ విధానంతో వాహనాల రద్దీ నివారించి ఇబ్బందులు దూరమయ్యే అవకాశం ఉంది.  కాగా, జనవరి 1 నుంచి ఫాస్ట్‌ ట్యాగ్‌ విధానం అమలు కోసం ఎన్‌హెచ్‌ఏఐ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడం జరుగుతుందని   సంబంధిత అధికారులు పేర్కొనగా.. రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని పలువురు వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

సమయం ఆదా..ప్రయాణం సులభం

ప్రస్తుతం నగదు చెల్లింపులతో వాహనదారులు టోల్‌ప్లాజా వద్ద వరుసలో ఉండి ఎక్కువ సమయం వేచిచూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నగదు చెల్లింపుతో చిల్లర డబ్బుల కోసం సైతం ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. నగదు చెల్లింపు కోసం ఒక్కొక్కరికి ఎక్కువ సమయం పట్టడంతో పాటు సమయం వృఽథా అవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో సైతం అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరడం కష్టం అవుతుంది. పాస్ట్‌ ట్యాగ్‌ పద్ధతి అమలులోకి వస్తే వాహనదారుల ఇబ్బందులు దూరమయ్యే అవకాశం ఉంది.

ఫాస్ట్‌ ట్యాగ్‌ పని చేసే విధానం ఇలా..

ఫాస్ట్‌ ట్యాగ్‌ అనేది ఎలక్ర్టానిక్‌ టోల్‌ సేకరణ వ్యవస్థ. దీనిని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తుంది. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ టెక్నాలజీని ఉపయోగించి వినియోగదారుని ఖాతా నుంచి డబ్బులను నేరుగా టోల్‌ప్లాజాకు బదిలీ చేస్తుంది. దీంతో ట్రాఫిక్‌లో వేచి చూడాల్సిన ఇబ్బంది వాహనదారులకు తప్పుతుంది. ఈ విధానం అమలుతో ఇంధనం పొదుపు కావడంతో పాటు కాలుష్యమూ తగ్గుతుంది.

ట్యాగ్‌ లేనిదే అనుమతి లేదు

2021 జనవరి 1వ తేదీ నుంచి టోల్‌ప్లాజా వద్ద టోల్‌ చెల్లింపులు ఫాస్ట్‌ ట్యాగ్‌ జరుపడానికి ఉత్తర్వులను ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు జారీ చేయడం జరిగింది. అయితే గతంలో ఉపయోగాత్మకంగా పరీక్షించి చూడటంతో మొదట్లో కొంత మేరకు మొరాయించినా.. ఆ తర్వాత మంచి ఫలితాలు రావడంతో టోల్‌ప్లాజాల వద్ద ‘నో ట్యాగ్‌.. నో ఎంట్రీ’ అనే విధానం కచ్చితంగా అమలు చేయాలంటూ కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. 

పాస్ట్‌ ట్యాగ్‌పై ముమ్మరంగా అవగాహన

ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ప్లాజాల అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో మండలస్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు కరపత్రాలను పంపిణీ, పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా టోల్‌ప్లాజా వద్ద మైక్‌లతో అవగాహన కల్పిస్తున్నారు. టోల్‌ప్లాజాల వద్దకు వచ్చే వాహనదారులను కలుస్తూ ఫాస్ట్‌ ట్యాగ్‌ గురించి వివరించడం జరుగుతుంది. 

ఫాస్ట్‌ ట్యాగ్‌ కోసం ప్రత్యేక కేంద్రాలు

ఫాస్ట్‌ ట్యాగ్‌ను పొందడానికి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రత్యేక కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసి ఫాస్ట్‌ ట్యాగ్‌ను సదరు వాహనదారులకు అందజేయడం జరుగుతుంది. అలాగే, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేసుకోవచ్చని సిబ్బంది సూచిస్తున్నారు.

ఫాస్ట్‌ ట్యాగ్‌తో సమయం ఆదా 

- పాపాయిగారి రాంరెడ్డి, వాహనదారుడు, బొప్పారం

ఫాస్ట్‌ ట్యాగ్‌ విధానంతో ఇబ్బందులు దూరం కావడంతో పాటు సమయం ఆదా అవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో గమ్య స్థానానికి సమయానికి చేరుకోవడం కష్టంగా ఉండేది. ప్రస్తుతం టోల్‌ప్లాజాల వద్ద వేచి చూసే ఇబ్బంది తప్పుతుంది.

చిల్లర డబ్బుల ఇబ్బందులు తప్పనున్నాయి

- వెంకయ్యగారి శ్రీనివాస్‌రెడ్డి, వాహనదారుడు, సోన్‌

ఫాస్ట్‌ ట్యాగ్‌ విధానంతో చిల్లర డబ్బుల సమస్య తీరుతుంది. కొన్ని కొన్ని సమయాల్లో చిల్లర డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు వచ్చేవి. నూతన విధానం అమలు చేస్తే వాహనాలలో ఇందనం పొదుపు కావడంతో పాటు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉండవు. 

Updated Date - 2020-12-28T06:04:11+05:30 IST