పీఆర్సీ ఇవ్వాలంటూ.. బీజేపీ కలెక్టరేట్ ముట్టడి
ABN , First Publish Date - 2020-12-15T06:37:04+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కాలయాపన చేస్తోందని,

మంగళ్హాట్ డిసెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కాలయాపన చేస్తోందని, ఇచ్చిన హామీలను మరిచి కేవలం ప్రకటనలతో కాలం గడుపుతోందని బీజేపీ నాయకులు, మాజీ మేయర్ బండ కార్తీక, బీజేపీ కార్యదర్శి రామకృష్ణ, బీజేపీ ఎస్సీ మోర్చా నగర కార్యదర్శి ప్రశాంత్ కుమార్, జాంబాగ్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైశ్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ నాయకులు నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్ను ముట్టడించారు. మాజీ మేయర్ బండా కార్తిక, బీజేపీ కార్యదర్శి రామకృష్ణ, జాంబాగ్ కార్పొరేటర్ రాకేష్ జైశ్వాల్, బీజేపీ సీనియర్ నాయకులు ఓం ప్రకాష్ భీష్వ మాట్లాడుతూ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్, పదోన్నతుల విషయంలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని, వెంటనే పీఆర్సీ, ఐఆర్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు బైఠాయించిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఆబిడ్స్, బేగంబజార్తో పాటు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
బేగంబజార్ పీఎస్ ముందు ..
అఫ్జల్గంజ్: జాంబాగ్ తాజా కార్పొరేటర్ రాకేష్ జైశ్వాల్, బీజేపీ కౌన్సిల్ సభ్యులు బంగారు సుధీర్కుమార్, బండ చంద్రారెడ్డి, ఓంప్రకాష్, రామకృష్ణ, జీ.అశ్విన్కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో నేతలు పోలీ్సస్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు.