మంచిర్యాల జిల్లాలో ‘స్వచ్ఛ సర్వేక్షణ్’కు సహకారం కరువు
ABN , First Publish Date - 2020-12-26T04:30:23+05:30 IST
మునిసిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్కు ప్రజల నుంచి సహకారం కరువైంది.
![మంచిర్యాల జిల్లాలో ‘స్వచ్ఛ సర్వేక్షణ్’కు సహకారం కరువు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020122510581074/12252020225833n70.jpg)
- యథేచ్ఛగా పాలిథిన్ కవర్ల అమ్మకాలు
-వ్యాపార వర్గాల్లో కానరాని మార్పు
-తలలు పట్టుకుంటున్న అధికారులు
మంచిర్యాల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్కు ప్రజల నుంచి సహకారం కరువైంది. పట్టణాల్లో 50 మైక్రాన్ల కన్న తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని అరికట్టాలని అధికారులు ఓ వైపు ప్రయత్నిస్తున్నా మరో వైపు వ్యాపారులు యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. విచ్చిలవిడిగా ప్లాస్టిక్ కవర్ల వినియోగంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధా న్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించింది. ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా మున్సిపల్ అధికారులు తరుచుగా తనిఖీలు నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తున్నా వ్యాపార వర్గాల్లో మార్పు రావడం లేదు. కొందరు వ్యాపారులు రహస్యంగా పెద్ద మొత్తంలో స్టాక్ నిలువ ఉంచుతూ కిరాణా షాపులు, దుకాణాల్లో విక్రయిస్తున్నారు. లక్షల రూపా యల విలువగల ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, పేపర్ ప్లేట్లను విక్రయిస్తూ వినియోగాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ వినియోగాన్ని ఎలా అరికట్టాలో తెలియక అధికారులు తలలు పట్టుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రత్యేకంగా గోదాముల ఏర్పాటు..
జిల్లా కేంద్రానికి చెందిన బడా వ్యాపారులు కొందరు కేవలం ప్లాస్టిక్ను స్టాక్ ఉంచేందుకే పదుల సంఖ్యలో గోదాములు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 7వ తేదీన రాత్రి మున్సిపల్ ఉద్యోగులు శ్రీనివాస టాకీసు రోడ్డులోని ఓ షాపులో ప్లాస్టిక్ ఉందన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. అయితే సదరు షాపు పక్కనే ఉన్న ఓ గోదా ములో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ నిలువ ఉన్నట్లు గుర్తించి తనిఖీలకు వెళ్లారు. తనిఖీ చేస్తున్న ఉద్యోగులపై సదరు వ్యాపారి కుటుంబ సభ్యుల తో కలిసి దాడికి పాల్పడ్డాడు. ప్లాస్టిక్కు నిషేధానికి సహకరించా ల్సింది పోయి అక్రమంగా స్టాకు ఉంచి తనిఖీలకు వెళ్లిన ఉద్యోగులపైనే దాడికి పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
స్వచ్ఛ పట్టణాలుగా..
మునిసిపాలిటీలను స్వచ్ఛ పట్టణాలుగా మార్చేందుకు కేంద్ర ప్రభు త్వం 2016 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందు లో భాగంగా పట్టణాల్లో ప్లాస్టిక్ నిషేధం అమలుపై సర్వే సైతం చేపడు తోంది. మునిసిపాలిటీల్లో వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, పరిసరాల శుభ్రత, పచ్చదనం తదితర అంశాలను లెక్కలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తోంది. నాలుగేళ్లుగా పథకం అమలవుతున్నా జిల్లాలోని ఏడు మునిసిపాలిటీల్లో ఏ ఒక్కదానికీ స్వచ్ఛ సర్వేక్షణ్లో చోటు దక్కక పోవ డం గమనార్హం. ఈ ఏడాది మునిసిపాలిటీలన్నీ స్వచ్చ సర్వేక్షణ్-2021కు గట్టిగా పోటీ పడుతున్నాయి. ప్లాస్టిక్ నియంత్రణ పూర్తిస్థాయిలో అమలు అయితేనే స్వచ్చ సర్వేక్షణ్లో చోటు దక్కుతుంది. ఇందు కోసం కేవలం అధికారులే కాకుండా ప్రజలు కూడా తమ సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది.
ప్రజలు సహకరించాలి..
- స్వరూపారాణి, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్
మంచిర్యాలను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించా లి. ప్రజలతోపాటు వ్యాపారులు, రాజకీయ నాయకులు సహకారం అందిస్తేనే స్వచ్చ సర్వేక్షణ్ -2021లో ర్యాంకు సాధించేందుకు అవకాశం ఉంటుంది. కేవలం మున్సిపల్ అధికారులో, ఉద్యోగులో ప్రయత్నించి నంత మాత్రాన ఉపయోగం ఉండదు. ప్లాస్టిక్ వాడకం నియంత్రణకు అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలి.