నిధుల వరద
ABN , First Publish Date - 2020-11-13T10:23:52+05:30 IST
కాగజ్నగర్ మున్సిపా లిటీకి నిధులు అపారంగా వచ్చాయి. రాష్ట్ర ప్రభు త్వం అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పది నెలల క్రితం ప్రవేశపెట్టింది. దీని కింద ఒక్కొక్క మున్సిపాలిటీకి రూ.46లక్షలు
కాగజ్నగర్ మున్సిపాలిటీకి 14వ ఆర్థికసంఘం నిధులు రూ.3కోట్లు మంజూరు
టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ.కోటి
పట్టణ ప్రగతి కింద రూ.46లక్షలు విడుదల
శరవేగంగా రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం
కాగజ్నగర్, నవంబరు12: కాగజ్నగర్ మున్సిపాలిటీకి నిధులు అపారంగా వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పది నెలల క్రితం ప్రవేశపెట్టింది. దీని కింద ఒక్కొక్క మున్సిపాలిటీకి రూ.46లక్షలు నిధులను ప్రత్యేక ప్యాకేజీ కింద విడు దల చేసింది. వీటితో కాగజ్నగర్ మున్సిపాలిటీలో రోడ్లు, మురికికాల్వల నిర్మాణం, అత్యవసర పనులు చేపడుతున్నారు. వీటితో పాటు ఇతర నిధులు కూడా వస్తుండడంతో పట్టణంలో అభివృద్ధి పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. మురికవాడల్లో కూడా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పట్ట ణంలో అభివృద్ధి పనులు వడివడిగా జరుగు తుండటంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపాలిటీకి వచ్చిన నిధులు ఇవే..
కాగజ్నగర్ మున్సిపాలిటీకి ప్రత్యేకంగా ప్రతీ నెల రూ.46లక్షల నిధులు మంజూరవుతున్నాయి. ఈ నిధులతో ప్రధానంగా వివిధ వార్డుల్లో మురికి కాల్వలు, అంతర్గత రోడ్లు చేపడుతున్నారు. ప్రస్తుతం సర్సిల్క్ ఇ టైపు కాలనీలో మురికి కాల్వల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే అంతర్గత రోడ్లు కూడా చేపడుతున్నారు. వీటితో పాటు కాంట్రాక్టు కార్మికులకు జీతభత్యాలు చెల్లిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.3కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో కూడా అంతర్గత రోడ్లు నిర్మాణం చేపడుతున్నారు. కాగజ్నగర్ ఈఎస్ఐ కాలనీలో రోడ్డును వేస్తున్నారు. పదేళ్ల నుంచి అంతర్గత రోడ్లు లేక తంటాలు పడుతున్న ఈ కాలనీ వాసుల సమస్యలు తీరనున్నాయి.
సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం
స్వచ్ఛ మున్సిపాలిటీ కింద రూ.2కోట్ల నిధులు రావడంతో ప్రత్యేకంగా రద్దీగా ఉండే ప్రాంతాలైన బస్టాండు ఏరియా, మార్కెట్ ఏరియా, సర్సిల్క్ ఏరియాలోని కూరగాయాల మార్కెట్, ఎల్ల్లాగౌడ్ తోట, రైల్వే కాలనీ, సంఘ బస్తీ, ఇందిరా మార్కెట్ ఏరియాల్లో 60 సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించారు. బహిరంగ మల, మూత్ర విసర్జన లేకుండా చేసేందుకు పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఒక్కో సామూహిక మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.3లక్షలు ఖర్చు చేయనున్నారు. ఇప్పటి వరకు 50 సామూహిక మరుగుదొడ్లు పూర్తి అయ్యాయి. వాటి జాబితాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వీటితో పాటు బయో టాయిలెట్ బస్సును కూడా ఈ నిధుల కింద కొనుగోలు చేశారు. మురికి కాల్వల్లో చెత్తపూడిక తొలగింపు కూడా చేపట్టారు. అకాల వర్షాలు కురిసినా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద కాగజ్నగర్ మున్సిపాలిటీకి వివిధ స్కీంల కింద రూ.6కోట్లకు పైగా నిధులు వచ్చాయి. వీటితో పెండింగ్ పనులను త్వరితగతిన చేపట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
పట్టణ సమస్యలు తీరనున్నాయి-జాకీర్ షరీఫ్, కాగజ్నగర్
కాగజ్నగర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈఎస్ఐ కాలనీలో రోడ్డు, సర్సిల్క్ కాలనీలో మురికి కాల్వలు, ఇతర వార్డుల్లో అంతర్గత రోడ్లు చేపడుతున్నారు. అధికా రులు పెండింగ్ పనులపై కూడా దృష్టిసారిస్తే పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.
పనులు శరవేగంగా సాగుతున్నాయి-రేగుల రాజు, కాగజ్నగర్
అధికారులు అభివృద్ధి పనులను శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈఎస్ఐ కాల నీలో కొన్ని సంవత్సరాలుగా రోడ్డు లేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య పరిష్కా రమైంది. అలాగే టిప్పర్ లైన్కు వెళ్లేందుకు రోడ్డు వేయడంతో ఆ సమస్య కూడా తీరిపోయింది. అన్ని వార్డుల్లో మురికి కాల్వలు, అంతర్గత రోడ్ల నిర్మాణం చేపడుతుండటంతో దశల వారీగా సమస్యలు తీరనున్నాయి.
ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం-శ్రీనివాస్, కమిషనర్, కాగజ్నగర్
కాగజ్నగర్ మున్సిపాలిటీకి వివిధ పథకాల కింద ప్రత్యేక నిధులు కేటాయించారు. పట్టణ ప్రగతి కింద రూ.46లక్షలు, ఇతరత్రా నిధులు కూడా వచ్చాయి. వీటితో అంతర్గత రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేపడుతున్నాం. అన్ని వార్డుల్లో ప్రాధాన్యతాక్రమంలో పనులను చేయిస్తున్నాం. మున్సిపాలిటీలో రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు పలు చోట్ల సాముహిక మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నాం. ఒక్కొక్క దాటికి రూ.3లక్షలు ఖర్చు చేస్తున్నాం. నిర్మాణం పూర్తికాగానే వాటి నిర్వహణ విషయంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.