జోరుగా ఇసుక దందా
ABN , First Publish Date - 2020-11-25T04:12:06+05:30 IST
జన్నారం మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది.
యథేచ్ఛగా తరలిస్తున్న అక్రమార్కులు
గోదావరి, వాగు పరివాహక గ్రామాల్లో డంప్లు
అడుగంటుతున్న భూగర్భజలాలు
ట్రాక్టర్ ఇసుక రూ.3వేలు
ఇసుక రీచ్లు ఏర్పాటు చేయాలంటున్న ప్రజలు
జన్నారం, నవంబరు 24 : జన్నారం మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మండ లంలో గోదావరి నది వైశాల్యం అధికంగా ఉండడం, వాగులు, వంకలు ఎక్కువగా ఉండడంతో ఇసుకాసురు లకు కాసుల పంట కురిపిస్తోంది. దీంతో అక్రమ ఇసుక రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. మండలం నుంచి ఇతర మండలాలకు, గ్రామాలకు ఇక్క డి ఇసుకను తరలిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్, నార్నూర్, ఊట్నూర్, నిర్మల్తోపాటు దండేపల్లి, లక్షెట్టిపేటలకు తరలిస్తున్నారు. కవ్వాల టైగర్జోన్ నుంచి ఇసుక రవాణా తరలించవద్దన్న నిబం ధనలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మండలం లోని బాదంపల్లి, కలమడుగు, ధర్మారం, రాంపూర్, చిన్నగూడెం, తపాలాపూర్ గ్రామాల గోదావరి రేవుల నుంచి సమీప గ్రామాల్లో ట్రాక్టర్లతో డంప్లుగా పోసి రాత్రి పూట తరలిస్తున్నారు. మైనింగ్ అధికారులు, పోలీ సులు, రెవెన్యూ అధికారులు దాడులు చేసి ట్రాక్టర్లను పట్టుకొని నామమాత్రపు జరిమానాలు విధిస్తున్నారు. అయినప్పటికీ దందా కొనసాగుతోంది. మొర్రిగూడెం వాగు కేంద్రంగా ఇందన్పల్లి, జన్నారం మండలంలో ఉన్న సుమారు 25 సిమెంటు ఇటుకల తయారీ కేం ద్రాలకు ఇసుకను తరలిస్తున్నారు. బ్రిక్స్ కేంద్రాల వద్ద కుప్పలు కుప్పలుగా సుమారు 150 నుంచి 200 ట్రిప్పుల ఇసుకను డంప్లుగా పోసుకొని యథేచ్ఛగా వాడుకుం టున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. అధికారులకు ఫిర్యాదులు వస్తే గ్రామాల్లో ఉన్న డంప్లపై, గృహాల వద్ద ఉన్న డంప్లపై దాడులు చేసి నామమాత్రంగా సీజ్ చేయడం, వారికి నోటీసులు ఇవ్వడం మాత్రమే చేసి చేతులు దులుపుకుంటున్నారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపైనే ఉన్న సిమెంటు బ్రిక్స్ కేంద్రాల వద్ద ఇసుక డంప్లు అధికారులకు ఎందుకు కనిపించ డం లేదని మండల వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇందన్ పల్లి, కొత్తపేట, మొర్రిగూడెం, బాదంపల్లి నుంచి అత్యధి కంగా ఇసుక అక్రమ రవాణా జరగడంతో వాటి పరివా హక పొలాలు, తోటలు సాగు చేసే రైతులు లబోదిబో మంటున్నారు. మొర్రిగూడెం వాగు పరివాహక రైతులు గతంలో ఆందోళనలు చేశారు. వేసవి కాలం వస్తే పంట లకు నీరందడం లేదని, భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయని, ఇసుక తీత నిలిపివేయాలని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.
భారమవుతున్న ఇసుక...
ఇసుక ధర అధికంగా ఉండడంతో ప్రజలు లబోదిబో మంటున్నారు. ట్రాక్టర్ల ట్రిప్పునకు రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. సామాన్య, పేదలకు ఇసుక దొరకడం గగనంగా మారింది.
ఇసుక రీచ్లు ఏవి...?
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు మైనింగ్ అధికారులు ఇసుక రీచ్లను ఏర్పాటు చేస్తామని ప్రతి పాదనలు చేశారు. గతంలో ట్రిప్పునకు రూ.800 పలు కగా ప్రస్తుతం రూ.3 వేలకు పెంచడంతో మండల వాసు లు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఇసుక రీచ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు
- తహసీల్దార్ పుష్పలత
అనుమతులు లేకుండా ఇసుక తరలించినా, నిల్వ చేసిన చర్యలు తప్పవని తహసీల్దార్ పుష్పలత అన్నారు. ఇటీవల మొర్రిగూడ, ఉట్టిగూడ, తిమ్మాపూర్, బాదంపల్లి గ్రామాల్లో దాడులు చేసి సుమారు 100 ట్రిప్పుల ఇసుక డంప్లను సీజ్ చేశామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కేసులు తప్పవని పేర్కొన్నారు.