కొనలేం..తినలేం
ABN , First Publish Date - 2020-09-14T10:25:35+05:30 IST
కూరగాయల ధరలు పేద, మధ్య తరగతి ప్రజలకు కంగారు పుట్టిస్తున్నాయి. ఒకవైపు కరోనాతో ఉపాధి కోల్పోయి పేదల పూట
భగ్గుమంటున్న కూరగాయల ధరలు
భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు
ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు
ఆసిఫాబాద్, సెప్టెంబరు13: కూరగాయల ధరలు పేద, మధ్య తరగతి ప్రజలకు కంగారు పుట్టిస్తున్నాయి. ఒకవైపు కరోనాతో ఉపాధి కోల్పోయి పేదల పూట గడవడమే కష్టంగా మారగా పౌష్టికాహారం తీసుకోవాలనే వైద్యుల సూచనలు పాటిస్తామంటే కూరగాయలు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో కిలోకు వచ్చిన ధరలతో ప్రస్తుతం పావు కిలో కూడా రావడం లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. పచ్చి మిర్చి కిలో ధర రూ.100 పలుకుతోంది. టమాట కిలో రూ.60 పలుకుతుండగా మునుపెన్నడూ లేని విధంగా వంకాయలు, బీరకాయ ధరలు సైతం అమాంతంగా పెరిగాయి. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. నెల రోజులుగా ధరలు ఏ మాత్రం తగ్గకపోగా పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు జిల్లాలో కూరగాయల సాగు తగ్గిపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు.
దెబ్బతీసిన వర్షాలు
ఆగస్టులో కురిసన భారీ వర్షాలకు కూరగాయల సాగు పూర్తిగా దెబ్బతింది. కుమరం భీం జిల్లాలో కూరగాయల సాగు అంతంత మాత్రంగానే ఉంది. నీటి వసతి లేక చాలా మంది కూరగాయల సాగుకు ముందుకు రావడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఉన్న కాస్త కూరగాయల తోటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది. మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటు తుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి
సాధారణంగా వేసవి కాలంలో కూరగాయల సాగు తక్కువగా ఉంటుంది. దీంతో జూన్, జూలై నెలల్లో ధరలు పెరగడం పరిపాటి. ఆ మాసాల్లో ఇతర ప్రాం తాల నుంచి కూరగాయలను వ్యాపారులు దిగుమతి చేస్తూ విక్రయాలు జరుపుతుంటారు. కానీ ఈసారి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించగా హోటళ్లు, హాస్టళ్లు, విద్యాసంస్థలు మూసివేయడం, శుభకార్యాలు నిలిచి పోవడంతో కూరగాయలు కొనేవారు లేక వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో చాలా మంది కూరగాయల సాగు నుంచి వైదొలగగా మరికొందరు గతంలో కంటే తక్కువ విస్తీర్ణంలో పండించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు మాసంలో జిల్లాలో భారీ వర్షాలు కురియడంతో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో వర్షాకాలంలోనూ ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. అసలే కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కూరగాయల ధరలు నడ్డి విరుస్తున్నాయి. పప్పు, పులుసుతోనే నెట్టుకొస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పూటగడవడం కష్టంగా మారుతుందని పేద ప్రజలు వాపోతున్నారు.
కూరగాయల ధరలు ఇలా... :
కూరగాయలు ధర
చిక్కుడు 120
టమాట 60
బెండకాయ 60
బీరకాయ 60
కాకరకాయ 80
వంకాయ 60
ఆలుగడ్డ 40
దొండకాయ 80
పచ్చిమిర్చి 100
గోరు చిక్కుడుకాయ 80
క్యాప్సికం 80
ములక్కాయ 100
అలసంత 70
సోరకాయ 70
కోత్మీర 200
ధరలు మండుతున్నాయి -పావని, గృహిణి, ఆసిఫాబాద్
మార్కెట్లో కూరగాయల ధరలు మండి పోతున్నాయి. కూరగాయలు కొనాలని మార్కెట్కు వెళ్తే జేబు ఖాళీ అవడం ఖాయం. టమాట, మిర్చి, కోత్మీర ధరలు బాగా పెరిగిపోయాయి. ధరలు ఎప్పుడు దిగి వస్తాయో తెలియడం లేదు.