విధులకు డుమ్మా కొట్టిన హెచ్ఎం సస్పెన్షన్
ABN , First Publish Date - 2020-12-04T05:38:13+05:30 IST
ప్రభుత్వ ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకుని ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్న పలువురు ఉపాధ్యాయులు విధులకు హాజరుకాక పోవడంతో ఇప్పటికే జిల్లా విద్యాధికారి రవీందర్రెడ్డి పలువురు టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆంధ్రజ్యోతిలో ‘‘బడికి డుమ్మా’’ అనే వార్త కథనం ప్రచురితమైంది.
జిల్లాలోని పలు పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో
ఆదిలాబాద్, డిసెంబర్3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకుని ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్న పలువురు ఉపాధ్యాయులు విధులకు హాజరుకాక పోవడంతో ఇప్పటికే జిల్లా విద్యాధికారి రవీందర్రెడ్డి పలువురు టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆంధ్రజ్యోతిలో ‘‘బడికి డుమ్మా’’ అనే వార్త కథనం ప్రచురితమైంది. దీంతో మరింత అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు అకస్మిక తనిఖీలతో దూకుడు పెంచారు. గురువారం నేరడిగొండ మండలం శంకర్రావు పేట గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న జె.హేమాజి గత నెల 23 తేదీ నుంచి విధులకు హాజరు కావడం లేదని విధుల నుంచి సస్పెన్షన్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
బజార్హత్నూర్: మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలను డీఈవో రవీందర్ రెడ్డి గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలోని ఉపాధ్యాయుల హాజరు పట్టికను, ఆన్లైన్ తరగతుల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కరోనా నేపథ్యంలో యాభైశాతం ఉపాధ్యాయులు తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలన్నారు. విద్యార్థులకు విధిగా ఆన్లైన్ తరగతులను నిర్వహించి పాఠ్యాంశాలపై పరీక్షలను నిర్వహించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల ను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రాన్ని సందర్శించారు. ఇందులో ఉపాధ్యాయులు ప్రసాద్, బలిరాం, ప్రకాష్, రమేష్, సిందు, పుశ్పలత పాల్గొన్నారు.
నేరడిగొండ: విద్యార్థులకు నిర్వహిస్తున్న డిజిటల్ తరగతులపై ఉపాధ్యా యులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఈవో రవీందర్రెడ్డి అన్నారు. గురువారం మండల కేద్రంలోని జడ్పీ పాఠశాలతోపాటు వడూర్, శంకరాపూర్ పాఠశాలలతో పాటు కస్తూర్బా బాలికల పాఠశాలలను తనిఖీ చేశారు. పాఠశాలల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రతిరోజూ విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకుంటే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట ఎంఈవో భుమారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు భారతి, ఉపాధ్యాయులు ఉన్నారు.