మొరం తోడేస్తున్నారు
ABN , First Publish Date - 2020-09-01T09:39:50+05:30 IST
పచ్చనదంతో కళకళలాడాల్సిన గుట్టలు కనుమరుగవుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా మొరం తవ్వకాలు చేపడుతూ అటవీ సంపదను కొల్లగొడుతున్నారు.

అక్రమార్కులకు వరమైన మొరం తవ్వకాలు
అనుమతులు లేకుండానే తరలింపు
యథేచ్చగా అక్రమ దందా
చోద్యం చూస్తున్న అధికారులు
అదృశ్యమవుతున్న ప్రకృతి వనరులు
దిలావర్పూర్, ఆగస్టు 31 : పచ్చనదంతో కళకళలాడాల్సిన గుట్టలు కనుమరుగవుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా మొరం తవ్వకాలు చేపడుతూ అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. అక్రమంగా మొరం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. భూమి లేని నిరుపేదలకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములను పంపిణీ చేసింది.
అయితే కొన్నిచోట్ల సాగుకు యోగ్యమైనవి కాని మరికొన్ని చోట్ల సాగుకు పనికి రాని గుట్టలతో కూడిన భూమిని పంపిణీ చేశారు. ఇదే అలుసుగా తీసుకున్న కొంతమంది అక్రమార్కులు భూములను చదును చేసి ఇస్తామని అమాయక రైతులను మభ్యపెట్టి మొరం తవ్వకాలు చేపడుతున్నారు. మండలంలోని కాల్వ అటవీప్రాంతంలో అక్రమ మొరం దందా యథేచ్ఛగా సాగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. జేసీబీలతో మొరం తవ్వకాలు చేపట్టి టిప్పర్లలో నిర్మల్ పట్టణానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రభుత్వ భూముల నుంచి కాని అటవీ ప్రాం తాల నుంచి కాని, చెరువుల నుంచి మొరం తీ యాలంటే తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి కాని ఇక్కడ అవేమి లేవు. భూ ముల చదును పేరుతో అక్రమంగా మొరం తవ్వుతూ గుట్టల ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. మొరం త వ్వకాలతో అడవుల కళ తప్పడంతో పాటు పెద్దఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.
మండలంలోని కాల్వ, కాల్వ తాండ, దిలావర్పూర్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మొరం అక్రమంగా తరలిస్తున్నారు.
చదును పేరుతో తవ్వకాలు
నిరుపేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూముల్లో మొరం తవ్వకాలు చేపట్టడం చట్ట విరుద్దం, సాగుకు యోగ్యంగా లేని భూములను ప్రభుత్వమే చదును చేయించి పంపిణీ చేయాల్సి ఉంటుంది. కాని ఇక్కడ అది జరగకపోవడంతో అక్రమార్కులుకు వరంగా మారిం ది. అమాయక రైతుల అసహయతను ఆసరా గా చేసుకున్న అక్రమార్కులు భూములను చదును చేసి సాగుకు యోగ్యంగా మారుస్తామని రైతులను నమ్మించి అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నారు.
ఒకవేళ అసైన్డ్ భూముల్లో మొరం తీయాలంటే రెవెన్యూ అధికారులు, మైనింగ్శాఖ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కాని ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రైతు లను నమ్మించి మొరంను కొల్లగొడుతూ కోట్లా ది రూపాయలకు పడగలెత్తుతున్నారు. అయి తే ఈ తతగం కొంత మంది అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రైతులకు పంపిణీ చేసి న భూములను ప్రభుత్వమే చదును చేసి అక్రమ మొరం తవ్వకాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
అక్రమంగా మొరం తరలిస్తే కఠిన చర్యలు...
అసైన్డ్ భూములు, చెరువు శిఖంల నుంచి మొరం తీయడం చట్టరీత్యా నేరం. కాల్వ శివారులో నుంచి మొరం తరలిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఒకవేళ అలా తరలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
- తహసీల్దార్ సంతోష్ రెడ్డి