తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-09-17T10:34:12+05:30 IST
మంచిర్యాల సిమెంట్ కంపెనీలో యాజమాన్యం తొలగించిన 20 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ
ఎంసీసీ కార్మిక సంఘం అధ్యక్షులు ముకేష్గౌడ్
మంచిర్యాల, సెప్టెంబరు 16: మంచిర్యాల సిమెంట్ కంపెనీలో యాజమాన్యం తొలగించిన 20 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ సిమెంట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గాజుల ముకేష్గౌడ్ డిమాండ్ చేశారు. సంఘ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులను విధుల్లోకి తీసుకుంటే కంపెనీ సక్రమంగా నడవడానికి ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. అలాకాకుండా కార్మికులకు అన్యాయం తలపెట్టాలని చూస్తే మాత్రం చట్టపరంగా ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్మికులకు ఎమ్మెల్యే దివాకర్రావు వెన్నంటి ఉంటారని, భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ మురళీధర్ మాట్లాడుతూ కంపెనీ లాభాల్లో ఉన్నప్పుడు విద్యుత్ బిల్లులు, మున్సిపల్ పన్నులు చెల్లించకుండా ఇప్పుడు కార్మికుల పొట్టకొట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. ఎంసీసీ యాజమాన్యం చేస్తున్న అవినీతి, అక్రమాలపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బీరయ్య, కోశాధికారి రమణ, ఇతర సభ్యులు, పలువురు కార్మికులు పాల్గొన్నారు.