విద్యుత్ శాఖలో ఏసీబీ అధికారుల దాడులు
ABN , First Publish Date - 2020-12-29T05:11:13+05:30 IST
జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు.
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఈ, ఏఈఈ, లైన్మన్
ఆదిలాబాద్టౌన్, డిసెంబరు 28: జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. పట్టణంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన బండారి సంతోష్ తన పవర్ ప్లాంట్లో నూతన మీటర్ కనెక్షన్ కోసం సంప్రదించగా విద్యుత్శాఖ ఏఈ శ్రీనివాస్, ఏఈఈ కృష్ణారావులతో పాటు లైన్మన్ ప్రకాష్ రూ.15వేల లంచం అడిగారు. దీంతో సంతోష్ ఏసీబీ అధికారు లను సంప్రదించారు. కొత్త మీటర్ కనెక్షన్ కోసం ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యుత్ శాఖ ఉద్యోగులపై ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం.. బండారి సంతోష్ రూ.15వేలను విద్యుత్ శాఖ ఉద్యోగులకు అందజేశారు. అక్కడే కాచుకొని ఉన్న ఏసీబీ అధికారులు ఏఈ, ఏఈఈ, లైన్మన్లను పట్టుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఏసీబీ డీఎస్పీ భద్రయ్య మాట్లాడుతూ బండారి సంతోష్ నుంచి లంచం అడుగుతున్నట్లు తెలియడంతో పథకం ప్రకారం వారిని రెడ్హ్యాం డెడ్గా పట్టుకున్నామని పేర్కొన్నారు. వీరిని అరెస్టు చేసి విచారణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.