11కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-04-08T10:59:59+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11కు చేరింది. ఇప్పటికే 10 పాజిటివ్ కేసులు నమోదు

జిల్లాలో తొలి ప్రైమరీ కాంటాక్ట్ కేసు నమోదు
ఆదిలాబాద్, ఏప్రిల్7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11కు చేరింది. ఇప్పటికే 10 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా మంగళవారం జిల్లాలో తొలి ప్రైమరీ కాంటాక్ట్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ కాలనీకి చెందిన 60 ఏళ్లకు పైబడిన ఒకరికి కరోనా పాజిటివ్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. 73 మంది అనుమానిత వ్యక్తుల నమూనాలను పరీక్షలకు పంపగా 11 మందికి పాజిటివ్గా తేలింది. మిగిలిన 62 మంది పరీక్షల్లో నెగిటివ్ వచ్చినటట్లు సమాచారం.
దీంతో జిల్లాలో ఢిల్లీ మర్కజ్కు వెళ్లి వచ్చిన వారి కేసులపై ఉత్కంఠకు తెరపడింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 3 కంటైన్మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేసి క్లస్టర్ పరిధిలో నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా, బయటి వారు లోనికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 19వార్డుల కంటైన్మెంట్ క్లస్టర్ ప్రత్యేకాధికారులతో కలెక్టర్ శ్రీదేవసేన సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. క్లస్టర్ పరిధిలోని ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్న వారికి మందులను అందజేయాలని అధికారులను ఆదేశించారు. కంటైన్మెంట్ క్లస్టర్ పరిధిలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.