రానున్న రోజుల్లో ఆఫీసులోని డెస్క్ను కూడా బుక్ చేసుకోవాల్సిందే: ఏడబ్ల్యూఎస్ సీఈఓ
ABN , First Publish Date - 2020-12-05T11:43:23+05:30 IST
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ విధంగా మార్చేసిందో కొత్తగా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ కుటుంబానికి నిమిషం కూడా సమయం
న్యూయార్క్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ విధంగా మార్చేసిందో కొత్తగా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ కుటుంబానికి నిమిషం కూడా సమయం కేటాయించని వారు కూడా మహమ్మారి పుణ్యమా అని నెలల నుంచి ఇంటికే పరిమితమైపోయారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటంతో అటు కుటుంబంతో సరదాగా గడుపుతూనే ఇటు ఆఫీసు పని కూడా పూర్తి చేసుకుంటున్నారు. ఇక భవిష్యత్తులో ఆఫీసుకు వెళ్లి పనిచేయడం అన్న విధానమే పూర్తిగా మారిపోనుందని అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) సీఈఓ ఆండీ జాసీ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఆఫీసులు ‘హాట్ ఆఫీసెస్’గా మారిపోతాయని, ఉద్యోగులు కూడా ఆఫీసులో డెస్క్ను రిజర్వ్ చేసుకునే రోజులు వస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచే పని చేసే అవకాశం ఉందని.. కేవలం ముఖ్యమైన ప్రాజెక్టులు ఉంటేనే ఆఫీసుకు వచ్చే అవసరం ఉంటుందన్నారు.
ప్రస్తుతం ప్రత్యేకంగా ఒక కంపెనీ కోసం పనిచేసే ఆఫీసు బిల్డింగులు రానున్న రోజుల్లో హాట్ ఆఫీసులుగా మారిపోతాయని తాను అనుకుంటున్నట్టు ఆండీ జాసీ చెప్పారు. అంటే.. ఉద్యోగులు ఆఫీసుకు రావాలంటే ముందుగానే ఓ డెస్క్ను రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. కరోనా మహమ్మారి డైలీ లైఫ్ను ఎన్నో రకాలుగా మార్చేసిందని ఆయన అన్నారు. రిమోట్గా పనిచేసే సమయంలో తలెత్తే ఇబ్బందులపై ఆయన మాట్లాడారు. కొత్త ప్రొడక్ట్లకు సంబంధించిన విషయాలను వీడియో కాల్స్లో మాట్లాడటం అన్నది చాలా కష్టమైన పని ఆయన పేర్కొన్నారు. అందరూ ఒకచోట లేకుండా కొత్త ప్రొడక్ట్లపై మీటింగ్ పెట్టడం అన్నది గజిబిజిగా ఉంటుందన్నారు. ఇక కరోనా కారణంగా నియామకాల విషయంలో కూడా ప్రస్తుతం అనేక మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పుకొచ్చారు. గతంలో ఆఫీసుకు వచ్చి పనిచేసే వారి కోసం వెతికితే.. ప్రస్తుతం రిమోట్గా పనిచేసే వారిని ఉద్యోగంలోకి తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్టు ఆండీ జాసీ తెలిపారు.