సరికొత్త ఈ-బైక్ను ఆవిష్కరించిన స్మార్ట్రాన్
ABN , First Publish Date - 2020-12-08T02:42:03+05:30 IST
హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ స్మార్ట్రాన్ ఇండియా ఇవాళ సరికొత్త స్మార్ట్ క్లౌడ్ కనెక్టెడ్ ఎలక్ట్రిక్ బైక్ ‘టిబైక్ ఒన్ ప్రొ’ను ఆవిష్కరించింది...

హైదరాబాద్: హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ స్మార్ట్రాన్ ఇండియా ఇవాళ సరికొత్త స్మార్ట్ క్లౌడ్ కనెక్టెడ్ ఎలక్ట్రిక్ బైక్ ‘టిబైక్ ఒన్ ప్రొ’ను ఆవిష్కరించింది. ప్రస్తుతం భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న షేర్డ్ మొబిలిటీ (వాహనాలను షేర్ చేసుకోవడం), బీ2బీ (బిజినెస్ టు బిజినెస్) వర్గాల కోసం ‘టిబైక్ ఒన్ ప్రొ’ను ప్రత్యేకంగా రూపొందించారు. దీనికోసం ట్రావెల్ టెక్ కంపెనీ బిలైవ్తో వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నట్టు స్మార్ట్రాన్ వెల్లడించింది. ప్రస్తుతం బిలైవ్ సేవలు అందుబాటులో ఉన్న మొత్తం 14 నగరాల్లో ఈ స్మార్ట్ క్లౌడ్ కనెక్టెడ్ ఈ-బైక్ను అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ పేర్కొంది. లాజిస్టిక్స్తో పాటు రిసార్టులు, రైడ్-షేర్, ఈ-కామర్స్, డెలివరీ సంస్థలు, ఈ-ఫార్మసీలు, ఈ-గ్రోసరీలకు సేవలందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. స్మార్ట్రాన్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ మహేష్ లింగారెడ్డి మాట్లాడుతూ.. ‘‘టీబైక్ ఒన్ ప్రో ఒక ఇంటిలిజెంట్ బైక్ మాత్రమే కాదు.. రైడర్లకు సరికొత్త అనుభూతిని కలిగించే కనెక్టడ్ ఈ-బైక్గా ఉండడం దీని ప్రత్యేకత. వినూత్నమైన, విప్లవాత్మక రీతిలో రైడర్లకు మెరుగైన ప్రయాణ అనుభూతులను అందిస్తుంది. ఆపరేట్ చేయడం కూడా చాలా తేలిక. నిర్వహణ కూడా చాలా సులభం...’’ అని పేర్కొన్నారు. స్మార్ట్రాన్ ఈ బైక్ కంపెనీ ట్రాన్స్క్ మోటార్స్ సీఈవో అనూప్ నిశాంత్ మాట్లాడుతూ ‘‘కేవలం జీవనశైలి ఆధారిత ఈవీ సాంకేతికత మాత్రమే కాకుండా అంతకు మించిన స్మార్ట్ ఫీచర్లతో టీబైక్ ఒన్ ప్రోను ఆవిష్కరించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈవీ అడాప్షన్ పరంగా అన్ని అవరోధాలనూ ఇది అధిగమిస్తుంది..’’ అని అన్నారు.