జంతుప్రదర్శనశాలలో ఆడ పులి మృతి..స్వాబ్ సేకరణ
ABN , First Publish Date - 2020-06-25T12:23:11+05:30 IST
ఆరున్నర సంవత్సరాల వయసున్న ఓ ఆడపులి మూత్రపిండాల వ్యాధితో మరణించిన ఘటన...
![జంతుప్రదర్శనశాలలో ఆడ పులి మృతి..స్వాబ్ సేకరణ](https://media.andhrajyothy.com/appimg/galleries/2020062506510955/06252020065245n5.gif)
కరోనా పరీక్ష కోసం స్వాబ్ సేకరణ
ఔరంగాబాద్ (మహారాష్ట్ర): ఆరున్నర సంవత్సరాల వయసున్న ఓ ఆడపులి మూత్రపిండాల వ్యాధితో మరణించిన ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలోని సిద్ధార్థ గార్డెన్ జంతుప్రదర్శనశాలలో జరిగింది. సిద్ధార్థ జంతుప్రదర్శనశాలలో కరీనా అనే ఆడపులి కొన్ని రోజులుగా మూత్రపిండాల సమస్యతో అనారోగ్యానికి గురైంది. మూడునాలుగు రోజులుగా ఏమీ తినని పులి ఉన్నట్టుండి మరణించింది. సెంట్రల్ జూ అథారిటీ సలహా ప్రకారం ఆడపులి కళేబరం నుంచి కరోనా పరీక్ష చేసేందుకు స్వాబ్ సేకరించామని జూ అధికారి చెప్పారు. కరీనా ఆడపులి అనారోగ్యానికి గురి కావడంతో టాప్ వెట్స్, పశుసంవర్థకశాఖ వైద్యులు చికిత్స చేశారని, ఆకలి తగ్గిన పులి విషయంలో పర్బానీలోని కాలేజ్ ఆఫ్ వెటర్నరీ యానిమల్ సైన్సెస్ నిపుణుల అభిప్రాయం కూడా కోరామని జూ అధికారులు చెప్పారు. మూత్రపిండాల వ్యాధి కారణంగానే పులి మరణించిందని పశువైద్యులు చెప్పారని జూ అధికారులు నిర్ధారించారు. ఔరంగాబాద్ జూపార్కులో 12 పులులుండగా వీటిలో రెండింటిని ముంబైలోని వీర్మతా జిజాబాయి ఉద్యానవనానికి మార్చారు. న్యూయార్క్ లోని బ్రోంక్స్ జంతుప్రదర్శనశాలలో నాడియా అనే నాలుగేళ్ల పులి కొవిడ్-19 బారిన పడిన నేపథ్యంలో జూపార్కులో పులి కళేబరం నుంచి కరోనా పరీక్ష కోసం స్వాబ్ సేకరించారు. గతంలో ఢిల్లీ జూపార్కులోనూ ఓ తెల్లపులి మరణించడంతో దాని కళేబరాన్ని కూడా పరీక్షించారు. అనంతరం జూపార్కును శానిటైజ్ చేయించారు.