50 వేల పాములను పట్టుకున్న వీరుడు... ఇప్పుడు ఆసుపత్రిలో...
ABN , First Publish Date - 2020-02-16T13:14:51+05:30 IST
అతను ఇప్పటివరకూ ఏకంగా 50 వేలకుపైగా పాములను పట్టుకున్నాడు. ఎక్కడ పాము కనిపించినా ఇట్టే పట్టేసుకుని అక్కడున్నవారి మదిలో హీరో అయిపోయేవాడు.
తిరువనంతపురం: అతను ఇప్పటివరకూ ఏకంగా 50 వేలకుపైగా పాములను పట్టుకున్నాడు. ఎక్కడ పాము కనిపించినా ఇట్టే పట్టేసుకుని అక్కడున్నవారి మదిలో హీరో అయిపోయేవాడు. అతనే కేరళలోని తిరువనంతపురానికి చెందిన వావా సురేష్(46). చిన్నప్పుడు తన తోటివారంతా బొమ్మలతో ఆడుకుంటుంటే, సురేష్ పాములను పట్టుకుని వాటితో ఆడుకునేవాడు. తరువాతి కాలంలో పాములు పట్టుకోవడమే అతని వ్యాపకంగా మారిపోయింది. ఆ మధ్య కేరళలో వరదలు వచ్చిన సమయంలోనూ జనావాసాల్లోకి వచ్చిన ఎన్నో పాములను పట్టుకుని, సురక్షితంగా అడవిలోకి వదిలిపెట్టాడు. పాములను పట్టుకునే క్రమంలో ఎన్నోసార్లు అవి కాటేశాయి. అయినా సురేష్ పాములను పట్టేందుకు వెనుకాడలేదు. అయితే ఇప్పుడు సురేష్ను ‘రక్త పింజరి’ కాటేసింది. ఈ నేపధ్యంలో వైద్యులు భాధితునికి యాంటీ వీనమ్ ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే ఇప్పటికే చాలాసార్లు ఆ ఔషధాన్ని సురేష్ వాడటంతో ఇప్పుడు ఆ మందు పనిచేయడంలేదు. దీంతో 72 గంటలు గడిస్తేకానీ సురేష్ ఆరోగ్య పరిస్థితి గురించి ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు.