కదిలే యోగాతో మానసిక ఆందోళనకు పరిష్కారం
ABN , First Publish Date - 2020-05-26T10:21:08+05:30 IST
కరోనా కారణంగా ఎదురవుతున్న వివిధ రకాల మానసిక సమస్యలకు కదిలే యోగాతో పరిష్కారం లభిస్తుందని సౌత్ ఆస్ర్టేలియా యూనివర్సిటీ
మెల్బోర్న్ మే 25 : కరోనా కారణంగా ఎదురవుతున్న వివిధ రకాల మానసిక సమస్యలకు కదిలే యోగాతో పరిష్కారం లభిస్తుందని సౌత్ ఆస్ర్టేలియా యూనివర్సిటీ, న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొంటున్నారు. స్పోర్ట్ మెడిసిన్ అనే బ్రిటీష్ జర్నల్లో ప్రచురితమైన వీరి అధ్యయనంలో ఒత్తిడి, ఆందోళన, స్కీజోఫ్రెనియా, నిరాశ, బైపోల్ డిజార్డర్, వ్యాకులత వంటి రుగ్మతలను అధిగమించి మానసిక ఆరోగ్యం మెరుగుపడటానికి ఈ యోగా దోహదం చేస్తుందని తేలింది. ఇందుకోసం భారత్, అమెరికా, జపాన్, చైనా, జర్మనీ, స్వీడన్కు చెందిన 1,080 మందిపై నిర్వహించిన 19 అధ్యయనాలను విశ్లేషించారు. కరోనాతో చాలా మంది ఇంట్లో నుంచే పని చేయడం, స్నేహితులు, కుటుంబ సభ్యులను కలవలేకపోవడంతో ఒంటరిగా భావించుకుంటూ ఏదో కోల్పోయామనే ఆలోచనలో ఉంటున్నారు. అటువంటి వారిని ఆరోగ్యవంతులుగా చేయడానికి వ్యాయామం తోడ్పడుతుంది. అయితే ప్రస్తుతం జిమ్, వ్యాయామ తరగతులు మూసివేసి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కదిలే యోగా మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.