80 వినూత్న ‘క్వారంటైన్ కేంద్రాలు’ నిర్మించిన గ్రామస్తులు.. సీఎం ప్రశంసలు..

ABN , First Publish Date - 2020-05-13T19:32:50+05:30 IST

క్వారంటైన్ సదుపాయం కోసం ఓ గ్రామానికి చెందిన ప్రజలు 80 ప్రత్యేక గుడిసెలు నిర్మించి ప్రశంసలు అందుకుంటున్నారు...

80 వినూత్న ‘క్వారంటైన్ కేంద్రాలు’ నిర్మించిన గ్రామస్తులు.. సీఎం ప్రశంసలు..

ఇంఫాల్: క్వారంటైన్ సదుపాయం కోసం ఓ గ్రామానికి చెందిన ప్రజలు 80 ప్రత్యేక గుడిసెలు నిర్మించి ప్రశంసలు అందుకుంటున్నారు. కొవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరిగి వస్తున్న తమ వారికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా వీటిలో సదుపాయం కల్పిస్తామని వారు చెబుతున్నారు. మణిపూర్‌లోని టుంజాయ్‌ గ్రామంలో పౌముయ్ తెగకు చెందిన ఈ ప్రజల క్రమశిక్షణ, కష్టించే పనిచేసే తత్వాన్ని చూసి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సైతం మురిసిపోయారు. ‘‘టుంజాయ్ గ్రామ పంచాయితీకి నా సెల్యూట్. రాష్ట్రం వెలుపల నుంచి రాబోతున్న తమ గ్రామస్తులకు క్వారంటైన్ సదుపాయం కోసం వీరంతా కలిసి ప్రత్యేకంగా 80 గుడిసెలు నిర్మించారు. ప్రతి గుడిసెలోనూ ఓ మంచం, ప్రత్యేక టాయిలెట్, గ్యాస్ టేబుల్, విద్యుత్ సదుపాయం, చార్జింగ్ సాకెట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. నీటి సరఫరాకి కూడా ఏర్పాటు చేశారు...’’ అని సీఎం ట్వీట్ చేశారు. క్వారంటైన్ కేంద్రాల్లో బస చేసే వారికి రేషన్ సరుకులు అందించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. కాగా లాక్‌డౌన్‌తో తమ రాష్ట్రానికి చెందిన దాదాపు 40 వేల మంది ప్రజలు ఆయా ప్రాంతాల్లో చిక్కుకున్నారనీ... వారిలో చాలామంది వెనక్కి తిరిగివచ్చేందుకు ఇష్టపడుతున్నారని సీఎం బీరేన్ సింగ్ పేర్కొన్నారు. 



Updated Date - 2020-05-13T19:32:50+05:30 IST