వివాహ బహుమతులు వద్దు...రైతులకు విరాళమివ్వండి

ABN , First Publish Date - 2020-12-10T14:10:23+05:30 IST

ఓ కుటుంబ వివాహ వేడుక సందర్భంగా ఉద్యమిస్తున్న రైతులకు బాసటగా నిలిచిన వినూత్న ఘటన.....

వివాహ బహుమతులు వద్దు...రైతులకు విరాళమివ్వండి

పంజాబ్ కుటుంబం వినతి

చంఢీఘడ్ (పంజాబ్): ఓ కుటుంబ వివాహ వేడుక సందర్భంగా ఉద్యమిస్తున్న రైతులకు బాసటగా నిలిచిన వినూత్న ఘటన పంజాబ్ రాష్ట్రంలోని శ్రీ ముక్త్సర్ సాహిబ్ పట్టణంలో వెలుగుచూసింది.శ్రీ ముక్త్సర్ సాహిబ్ పట్టణానికి చెందిన వరుడు అభిజిత్ సింగ్ తన వివాహం చేసుకున్నారు. తన వివాహ విందు సందర్భంగా రైతుల కోసం ఏదైనా చేయాలని వరుడితో పాటు అతని బంధువులు నిర్ణయించుకున్నారు. అంతే వివాహ వేడుకకు వచ్చిన అతిథులు తమకు బహుమతులు ఇవ్వవద్దని, దానికి బదులుగా ఉద్యమిస్తున్న రైతులకు డబ్బును విరాళంగా అందజేయండి అంటూ వివాహ వేడుకలో రైతు విరాళం డబ్బాను ఏర్పాటు చేశారు. 


కేంద్రప్రభుత్వం కొత్తగా చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు తాము సహాయ పడేందుకు తమ పెళ్లికి వచ్చిన అతిథులను బహుమతులకు బదులుగా రైతులకు విరాళాలు ఇవ్వాలని కోరినట్లు వరుడు అభిజిత్ సింగ్ చెప్పారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఉద్యమిస్తున్న విషయం విదితమే. తన పెళ్లి వేడుకను సైతం రైతులకు ఉపయోగపడేలా విరాళాల సేకరణకు వినియోగిస్తున్నామని వరుడు అభిజిత్ సింగ్ వివరించారు. ఉద్యమిస్తున్న రైతులకు అండగా నిలిచిన వరుడిని, అతని కుటుంబాన్ని పలువురు అభినందించారు. 

Updated Date - 2020-12-10T14:10:23+05:30 IST