భూ అయస్కాంత క్షేత్ర ఆవిర్భావానికి కారణం ‘మ్యాంటిల్’
ABN , First Publish Date - 2020-03-16T09:26:40+05:30 IST
భూ అయస్కాంత క్షేత్రం ఎలా ఏర్పడింది? ఈప్రశ్నకు ఇప్పటివరకు భూమిలోని ‘కోర్’ పొర అనే సమాధానం వినిపించేది. కానీ అమెరికాలోని కాలిఫోర్నియా శాండియాగో వర్సిటీ శాస్త్రవేత్తలు...
అమెరికాలోని శాండియాగో వర్సిటీ శాస్త్రవేత్తలు
లాస్ ఏంజెలిస్, మార్చి 15 : భూ అయస్కాంత క్షేత్రం ఎలా ఏర్పడింది? ఈప్రశ్నకు ఇప్పటివరకు భూమిలోని ‘కోర్’ పొర అనే సమాధానం వినిపించేది. కానీ అమెరికాలోని కాలిఫోర్నియా శాండియాగో వర్సిటీ శాస్త్రవేత్తలు మాత్రం ‘మ్యాంటిల్’ పొర అని బదులిస్తున్నారు. తమ అధ్యయనంలో ఈవిషయమే తేలిందని వారు వాదిస్తున్నారు. భూమి పైపొర ‘క్రస్ట్’పై మనం జీవిస్తున్నాం.
దాని కింద మ్యాంటిల్, ‘కోర్’, లిథోస్పియర్, ఎస్తెనోస్పియర్ అనే మరో నాలుగు రకాల పొరలు ఒకదాని తర్వాత ఒకటిగా ఉంటాయి. మ్యాంటిల్ పొర దిగువ భాగంలోని ద్రవరూప సిలికేట్ విద్యుత్ వాహకంగా పనిచేసి భూమికి బలమైన అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పర్చుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అయస్కాంత క్షేత్రం ప్రభావంతో సూర్యుడి నుంచి వెలువడే సౌర పవనాలు భూమిపైకి చేరకముందే దారిమళ్లిపోతాయి. ఒకవేళ ఇదే లేకుంటే సూర్యుడి అతినీల లోహిత కిరణాల నుంచి భూమండలాన్ని కాపాడే ఓజోన్ పొర ఎప్పుడో ఛిద్రమైపోయేది.