క్వారంటైన్లో దివ్యాంగునితో స్నేహం.... తరువాత..
ABN , First Publish Date - 2020-05-18T16:24:34+05:30 IST
వారిద్దరూ క్వారంటైన్ కేంద్రంలో స్నేహితులుగా మారారు. కొన్నిరోజుల తరువాత వారికి ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. అయితే వారిలో ఒకరు దివ్యాంగుడు. తన మూడు చక్రాల వాహనంలో ఇంటికి వెళ్లడానికి...
లక్నో: వారిద్దరూ క్వారంటైన్ కేంద్రంలో స్నేహితులుగా మారారు. కొన్నిరోజుల తరువాత వారికి ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. అయితే వారిలో ఒకరు దివ్యాంగుడు. తన మూడు చక్రాల వాహనంలో ఇంటికి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నాడు. దీనిని గ్రహించిన స్నేహితుడు తన ప్లాన్ మార్చుకుని, దివ్యాంగ స్నేహితునికి చేయూతనందించాడు. 5 రోజుల్లో 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆ దివ్యాంగ స్నేహితుడిని అతని ఇంటికి చేర్చాడు. వివరాల్లోకి వెళితే యూపీలోని ముజఫ్ఫర్నగర్కు చెందిన దివ్యాంగుడు గయూర్ అహ్మద్ (40) రాజస్థాన్లోని జోధ్పూర్లో గల క్వారంటైన్ కేంద్రంలో అనిరుధ్ను (28) ను కలిశాడు. గయూర్ వడ్రంగిగా పనిచేస్తుండగా, అనిరుధ్ మహారాష్ట్రలోని నాగ్పూర్ నుండి ఇక్కడికి వచ్చి లాక్డౌన్లో చిక్కుకుపోయాడు. వీరిద్దరినీ క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. అక్కడ వీరిద్దరూ స్నేహితులయ్యారు. మే 8న వీరి క్వారంటైన్ గడువు ముగిసి పోవడంతో వారిని బస్సులో యూపీ సరిహద్దు సమీపంలో విడిచిపెట్టారు. అక్కడి నుంచి ఇద్దరూ ఎవరిదారిన వారు వెళ్లాలని అనుకున్నారు. అయితే దివ్యాంగుడైన గయూర్ తన మూడు చక్రాల వాహనంలో వెళ్లలేకపోతున్నాడు. దీనిని గమనించిన అనిరుధ్ స్నేహితుడిని అతని గ్రామానికి దిగబెట్టాలని నిర్ణయించుకున్నాడు. వీరిద్దరూ మధుర, అలీగఢ్, బులంద్షహర్, హాపూర్, మీరట్ మీదుగా ముజఫ్ఫర్ నగర్ చేరుకున్నారు. ఇటువంటి పరిస్థితిలో తనకు చేయూతనందించిన అనిరుధ్కు గయూర్ కృతజ్ఞతలు తెలిపాడు.