వధువుకు కరోనా సోకడంతో పీపీఈ కిట్లతో పెళ్లి
ABN , First Publish Date - 2020-12-07T11:36:01+05:30 IST
వధువుకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో నూతన వధూవరులతోపాటు పురోహితుడు, అతిథులు కూడా వ్యక్తిగత రక్షణ దుస్తులు (పీపీఈ కిట్సు) ధరించి వివాహ తంతులో పాల్గొన్న...

జైపూర్ (రాజస్థాన్): వధువుకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో నూతన వధూవరులతోపాటు పురోహితుడు, అతిథులు కూడా వ్యక్తిగత రక్షణ దుస్తులు (పీపీఈ కిట్సు) ధరించి వివాహ తంతులో పాల్గొన్న ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని షాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. షాబాద్ జిల్లాకు చెందిన యువతికి ఓ యువకుడితో పెళ్లికి తేదీ, ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి రోజే వధువుకు కరోనా సోకిందని పరీక్షల్లో వెల్లడైంది. కరోనా సోకినా ముందుగా నిశ్చయించిన ప్రకారం పెళ్లి కార్యక్రమాన్ని కొనసాగించాలని వధూవరుల కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు.
వధూవరులతోపాటు పురోహితుడు, పెళ్లికి హాజరైన అతిథుల కోసం పీపీఈ కిట్లను తెప్పించారు. వధూవరులతో పాటు అందరూ పీపీఈ కిట్లను ధరించి వివాహ తంతు కొనసాగించారు. పీపీఈ కిట్ ధరించిన పురోహితుడు వధూవరులకు సూచనలిస్తూ పెళ్లి జరిపించేశారు.వరుడు చేతికి తొడుగులతో పాటు పీపీఈ కిట్ వేసుకొని తలపాగా ధరించారు. వధువు పీపీఈ కిట్ తోపాటు ఫేస్ షీల్డు, చేతికి గ్లౌజులు ధరించి పెళ్లి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పీపీఈ కిట్ల మధ్య జరిగిన పెళ్లిని కరోనా పెళ్లిగా అతిథులు అభివర్ణించారు.