కరోనా లక్షణాలు దాచి విమానం ఎక్కేశాడు.. ప్రయాణం మధ్యలో కుప్పకూలడంతో..

ABN , First Publish Date - 2020-12-20T13:47:06+05:30 IST

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా పేరు చెబితే..

కరోనా లక్షణాలు దాచి విమానం ఎక్కేశాడు.. ప్రయాణం మధ్యలో కుప్పకూలడంతో..

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా పేరు చెబితే వణుకుతోంది. ఈ వైరస్ వల్ల అగ్రరాజ్యం అమెరికా కూడా విలవిల్లాడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చాలా దేశాల్లో లాక్‌డౌన్‌లు ఎత్తేసి ప్రజా రవాణాకు అనుమతులు ఇచ్చినప్పటికీ.. ఈ మహమ్మారి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు. కరోనా సంబంధిత లక్షణాలుంటే వెంటనే టెస్టులు చేయించుకోవడం, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తదితర జాగ్రత్తలు ప్రపంచంలో ఏ మూలకెళ్లినా కనబడుతున్నాయి. అయితే ప్రపంచం మొత్తం ఇంతలా అప్రమత్తంగా ఉంటే కొంతమంది మాత్రం తమకు ఉన్న కరోనా లక్షణాలను దాచి తప్పించుకోవాలని చూస్తున్నారు.


అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడా నుంచి లాస్ ఏంజెల్స్‌కు ఓ విమానం బయలు దేరింది. ప్రయాణికులంతా ఎక్కేశారు. ఈ విమానం ఎక్కేముందు ప్రయాణికులందరికీ ఓ ఫామ్‌ ఇస్తున్నారు. దీనిలో ప్రయాణికులకు కరోనా లక్షణాలు ఉన్నాయా? లేక గతంలో ఎప్పుడైనా కరోనా వచ్చిందా? వంటి ప్రశ్నలు ఉన్నాయి. వీటికి వచ్చిన సమాధానలను చెక్ చేసిన తర్వాతే ప్రయాణికులను విమానంలోకి అనుమతిస్తున్నారు. ఈ సమయంలో తనకు గతంలో కరోనా రాలేదని, అలాగే ఎటువంటి కరోనా లక్షణాలు కూడా లేవని ఓ వ్యక్తి సంతకం చేశాడు. విమానం ప్రయాణం మధ్యలో ఉండగానే ఆ వ్యక్తి కుప్పకూలాడు. ఏం జరిగిందా? అని చూసిన విమాన సిబ్బంది.. సదరు వ్యక్తికి గుండెపోటు వచ్చిందని గుర్తించారు. పరిస్థితి గమనించిన పైలట్.. వెంటనే విమానం దారి మళ్లించి న్యూఆర్లీన్స్‌కు తీసుకొచ్చాడు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ అతను మరణించాడు.


సదరు ప్రయాణికుడిని అంబులెన్సులో ఎక్కిస్తుండగా.. అతని భార్య చెప్పిన మాటలు ఇప్పడు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో తెలుసా? తన భర్తలో కరోనా లక్షణాలు ఉన్నాయని, కొన్ని రోజులుగా ఆయనకు రుచి, వాసన తెలియడం లేదని. ఈ విషయం బయట పడటంతో సదరు విమానాన్ని నడిపిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అప్రమత్తం అయింది. వెంటనే సంబంధిత ప్రభుత్వ శాఖకు ఈ సమాచారం అందించింది. ఆ విమానం దారి మారిన సమయంలో కూడా ప్రయాణికులెవరూ విమానం మారలేదని, అందరూ అదే విమానంలో ప్రయాణించారని చెప్పింది. ఈ విషయంలో అధికారులు ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు యునైటెడ్ ప్రకటించింది. మరణించిన ప్రయాణికుడి ద్వారా ఎవరికైనా కరోనా సోకే ప్రమాదం ఉండటంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి, విమాన ప్రయాణికులను ట్రాక్ చేసే పనిలో పడ్డారు.

- పి.ఫణీంద్ర

Updated Date - 2020-12-20T13:47:06+05:30 IST