కరోనా ఎఫెక్ట్: సెల్ ఫోన్ టవర్లు తగల బెట్టేస్తున్నారు!
ABN , First Publish Date - 2020-04-22T03:51:44+05:30 IST
ఐరోపా దేశాల్లో కొంత మంది.. కరోనా వ్యాప్తి వెనకాల 5జీ టెక్నాలజీ ఉందని నమ్మతున్నారు. అక్కడితో ఆగకుండా సెల్ టవర్లపై తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు.

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభానికి ఎవరు కారణం?.. ఇది సమాధానం దొరకని ప్రశ్న. దీని వెనకాల అమెరికా కుట్ర ఉందని చైనా ఆరోపిస్తే.. చైనా వారి దాపరికమే ఈ మహమ్మారికి పురుడు పోసిందని అమెరికా వాదిస్తోంది. అయితే ఇది ప్రధాన మీడియాలో వినిపిస్తున్న వాదనలు. వీటికి అదనంగా జన బాహుళ్యంలో ఇంకా అనేక అపోహలు వ్యాప్తిలో ఉన్నాయి. ఐరోపా దేశాల్లో కొంత మంది.. కరోనా వ్యాప్తి వెనకాల 5జీ టెక్నాలజీ ఉందని నమ్మతున్నారు.
అక్కడితో ఆగకుండా సెల్ టవర్లపై తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ముందూ వెనుకా ఆలోచించకుండా వాటిని తగలబెట్టేస్తున్నారు. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాల్లో కలవరం మొదలైంది. టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని ఆయా దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. ఈ అపోహలను దూరం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు.