కోవిడ్-19 ఎఫెక్ట్: భారీగా పెరిగిన గేమింగ్ యాప్స్ వినియోగం

ABN , First Publish Date - 2020-03-24T01:53:32+05:30 IST

కరోనా వైరస్ భయంతో దేశ ప్రజలందరూ చాలా వరకు ఇళ్లలోనే గడుపుతున్నారు. ఫలితంగా పుస్తకాలు చదవడం,

కోవిడ్-19 ఎఫెక్ట్: భారీగా పెరిగిన గేమింగ్ యాప్స్ వినియోగం

బెంగళూరు: కరోనా వైరస్ భయంతో దేశ ప్రజలందరూ చాలా వరకు ఇళ్లలోనే గడుపుతున్నారు. ఫలితంగా పుస్తకాలు చదవడం, కామిక్స్ చూడడం, గేమింగ్ యాప్స్ వినియోగం ఎక్కువైంది. గత రెండు నెలలుగా మొబైల్ బ్రౌజింగ్ యాప్ యాక్టివిటీ దాదాపు 40 శాతం పెరిగినట్టు ఓ నివేదిక వెల్లడించింది. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో దేశం దాదాపు లాక్‌డౌన్ స్థితిలో ఉంది. ఇళ్లకే పరిమితమైన ప్రజలు మొబైల్స్‌కే పరిమితమై న్యూస్, సమాచారం, ఎంటర్‌టైన్మెంట్ వంటి వాటిని అందులోనే వెతుక్కుంటున్నారు. ఈ విషయాన్ని బెంగళూరుకు చెందిన ‘ఇన్‌మోబి గ్రూప్’ నివేదిక వెల్లడించింది.


‘కోవిడ్-19 కన్జుమర్ ఇన్‌సైట్స్’ పేరుతో పలు విషయాలు వెల్లడించింది. జనవరి తొలి వారం నుంచి ఈ నెల 11 వరకు డేటా సిగ్నల్స్‌ను విశ్లేషించడం ద్వారా ఈ నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లొకేషన్ ట్రెండ్స్, వినియోగదారుల ఇన్‌-యాప్ బిహేవియర్‌ను వెల్లడించింది. అది వెల్లడించిన వివరాల ప్రకారం.. బుక్స్, కామిక్ యాప్స్ వినియోగం 200 శాతం పెరగ్గా, గేమింగ్ యాప్స్ వినియోగం 110 శాతం పెరిగింది. ఇమేజ్, వీడియో ఎడిటింగ్ యాప్ వినియోగం 60 శాతం పెరిగింది. మొబైల్ బ్రౌజింగ్ యాప్ యాక్టివిటీ 37 శాతం పెరిగింది. మార్చి 5 నుంచి అయితే ఇమేజ్, వీడియో ఎడిటింగ్ యాప్ వినియోగం రాకెట్ స్పీడ్ అందుకుందని వివరించింది. ఫిబ్రవరి 12 నుంచి గేమింగ్ యాప్‌ల వినియోగం క్రమంగా పెరినట్టు పేర్కొంది.


పాఠశాలల మూసివేతతో బుక్స్, కామిక్స్ యాప్‌కు పాపులారిటీ పెరిగిందని, ఈ నెల తొలి వారం తర్వాత ఇటువంటి యాప్‌ల వినియోగం ఒక్కసారిగా పెరిగినట్టు తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటకలో స్కూళ్లు మూతపడిన తర్వాత లెర్నింగ్, రీడింగ్ యాప్స్‌కు డిమాండ్ పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. జనవరి మాసాంతంలో బ్రౌజింగ్ యాప్‌ల వినియోగం పడిపోగా, దేశంలో తొలి కోవిడ్ నమోదైన తర్వాత బ్రౌజింగ్ యాప్‌ల వినియోగం అమాంతం పెరిగినట్టు వివరించింది.

Updated Date - 2020-03-24T01:53:32+05:30 IST