అల్జీమర్స్ను గుర్తించే రక్తపరీక్ష
ABN , First Publish Date - 2020-07-30T06:39:04+05:30 IST
మిల్వాకీ (అమెరికా), జూలై 29 : చిన్నపాటి రక్తపరీక్షతోనే మతిమరుపు వ్యాధి ‘అల్జీమర్స్’ను నిర్ధారించవచ్చని అమెరికాలోని అల్జీమర్స్ అసోసియేషన్ శాస్త్రవేత్తలు అంటున్నారు...
మిల్వాకీ (అమెరికా), జూలై 29 : చిన్నపాటి రక్తపరీక్షతోనే మతిమరుపు వ్యాధి ‘అల్జీమర్స్’ను నిర్ధారించవచ్చని అమెరికాలోని అల్జీమర్స్ అసోసియేషన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇందుకు సంబంధించిన రక్త పరీక్ష పద్ధతిని తాము అభివృద్ధి చేశామని, ప్రయోగదశలో ఉన్న ఆ పరిజ్ఞానంతో 89 నుంచి 98 శాతం మేర కచ్చితత్వంతో ఫలితాలు వస్తున్నట్లు వెల్లడించారు. మిగతా ప్రయోగ దశలనూ విజయవంతంగా పూర్తిచేసి, ఈ పద్ధతి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అల్జీమర్స్ నిర్ధారణకు మూడు పద్ధతులు ఉన్నాయి. రోగి జ్ఞాపకశక్తిలో వచ్చిన మార్పులను న్యూరాలజిస్టు నేరుగా పరీక్షించి చూడటం ఒక రకం కాగా.. వెన్నెముకలోని ద్రవాలను పరీక్షించడం, మెదడును స్కాన్ చేయడం మిగతా రెండు రకాలు. మొదటి పద్ధతి చౌకదే అయినప్పటికీ కచ్చితత్వం తక్కువ. చివరి రెండు పద్ధతుల్లో కచ్చితత్వమున్నా ఖర్చు ఎక్కువ. ఈ పరిమితులను అధిగమిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ కచ్చితత్వంతో అల్జీమర్స్ను నిర్ధారించడమే సరికొత్త రక్త పరీక్ష పద్ధతి ప్రత్యేకత అని అల్జీమర్స్ అసోసియేషన్ ముఖ్య సైన్స్ అధికారి మారియా కెరీలో వివరించారు.