నీట్ కోసం 700 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం! చివర్లో విద్యార్థికి భారీ షాక్!
ABN , First Publish Date - 2020-09-14T17:44:44+05:30 IST
700 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన పరీక్ష రాయలేకపోయిన విద్యార్థి
పాట్నా: నీట్ పరీక్షకు హాజరవ్వాలని బీహార్కు చెందిన సంతోష్ కుమార్ అనే విద్యార్థి ఏకంగా 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. తన స్వస్థలమైన ధర్భంగా నుంచీ ఏకంగా 24 గంటల సుదీర్ఘ ప్రయాణం చేసి కోల్కతాలోని సాల్ట్లేక్ ప్రాంతంలో ఉన్న పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు.
కానీ చివర్లో అతడి ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది. అసలు గమ్యానికి పది నిమిషాల దూరంలోనే ఆగిపోయింది. పరీక్ష కేంద్రానికి రావడంలో అతడికి 10 నిమిషాలు ఆలస్యం కావడంతో అధికారులను అతడిని హాల్లోకి అనుమతించలేదు. ఎంత వేడుకున్నా వారు కనికరించలేదు. దీంతో అతడి విద్యార్థి జీవితంలో ఏడాది కాలం వృథా అయిపోయింది.
‘నేను వారిని వేడుకున్నా. కానీ ఆలస్యమైందని వారు చెప్పారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభవుతుంది. నేను 1.40కి అక్కడి చేరుకున్నాను. కానీ 1.30 తరువాత ఎవరినీ అనుమతించమని అధికారులు ఇది వరకే తేల్చిచెప్పారు. దీంతా నాకు ఓ ఏడాది వృథా అయిపోయింది’ అని స్థానిక మీడియా ప్రతినిధులతో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణంలో తాను ఎదుర్కొన్న సమస్యలను వారికి వివరించాడు.
‘ధర్బంగా నుంచి ముజఫ్ఫర్పూర్ చేరుకునేందుకు నేను శనివారం ఉదయం 8 గంటలకు బస్సెక్కాను. ముజఫ్ఫర్నగర్కు చేరుకుని అక్కడ పాట్నా వెళ్లే బస్సెక్కాను. కానీ దారిలో ట్రాఫిక్ జామ్ కావడంతో ఏకంగా 6 గంటల పాటు ఆలస్యం జరిగింది. అనంతరం పాట్నాలో రాత్రి 9 గంటలకు మరో బస్సేక్కాను. మధ్యాహ్నం 1.06 గంటలకు కోల్కతా చేరుకున్నాను. ఆ తరువాత ట్యాక్సీలో పరీక్షా కేంద్రానికి చేరుకునే సరికి 1.40 అయింది’ అని అతడు వాపోయాడు.
కాగా.. ఈ విషయమై సదరు పరీక్ష కేంద్రం ఇప్పటివరకూ స్పందించలేదని తెలుస్తోంది. ఇక పరీక్ష కేంద్రాలు ఇలా నిక్కచ్చిగా డెడ్లైన్ నిబంధన అమలు చేస్తుండటంపై ఇప్పటికే అనేక మార్లు పలు విమర్శలు చెలరేగుతున్న విషయం తెలిసిందే.