అమూల్యకు శిక్ష తప్పదు.. హెచ్చరించిన యడియూరప్ప

ABN , First Publish Date - 2020-02-22T03:17:15+05:30 IST

నగరంలో నిర్వహించిన సీఏఏ వ్యతిరేక ర్యాలీలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినాదాలు చేసిన

అమూల్యకు శిక్ష తప్పదు.. హెచ్చరించిన యడియూరప్ప

బెంగళూరు: నగరంలో నిర్వహించిన సీఏఏ వ్యతిరేక ర్యాలీలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినాదాలు చేసిన అమూల్య లియోనకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆరోపించారు. దేశ వ్యతిరేక నినాదాలు చేసిన అమూల్యపై దేశద్రోహం కేసు నమోదైంది. నినాదాలు చేసిన వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అమూల్యకు కోర్టు 14 రోజుల కస్టడీకి ఆదేశించింది.


శుక్రవారం మైసూరులో మీడియాతో మాట్లాడిన యడియూరప్ప..  అమూల్య వంటి వ్యక్తుల వెనుక ఉన్న సంస్థలు, వాటిని పెంచి పోషిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుంటే తప్ప ఇలాంటివి అంతం కావని అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించడమే ఈ ఘటన వెనక ఉన్న ప్రధాన ఉద్దేశమని తేటతెల్లమైందన్నారు. ఆమె వెనక ఉన్న సంస్థలపై దర్యాప్తు జరిగితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని యడియూరప్ప పేర్కొన్నారు. గతంలో ఆమెకు నక్సల్స్‌తో సంబంధాలు ఉండేవన్న విషయంలో స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆమెకు శిక్ష తప్పదని, ఆమె వెనక ఉన్న సంస్థలపైనా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

Updated Date - 2020-02-22T03:17:15+05:30 IST