కరోనాతో చర్మం రంగు మారిన వుహాన్ డాక్టర్ మృతి!
ABN , First Publish Date - 2020-06-03T01:14:15+05:30 IST
కరోనా కారణంగా చర్మం రంగు మారిన వుహాన్ నగరంలోని డాక్టర్ ఈ మహమ్మారికి బలైపోయనట్టు తెలుస్తోంది.
వుహాన్(చైనా): కరోనా కారణంగా చర్మం రంగు మారిన వుహాన్ డాక్టర్ ఈ మహమ్మారికి బలైపోయనట్టు తెలుస్తోంది. నాలుగు నెలల పాటు వ్యాధితో పోరాడిన హూ వెయిఫింగ్ ఇటీవల ప్రాణాలు విడిచాడని సమాచారం. నగరంలో అత్యధిక కరోనా రోగులకు చికిత్స నందిస్తున్న వుహాన్ సెంట్రల్ ఆస్పత్రిలో ఆయన సేవలందించారు. కొద్ది కాలంగా ప్రశాంతంగా ఉన్న వుహాన్ నగరంలో ఈ ఘటనతో మరోసారి కరోనా మరణమృదంగం మోగినట్టైంది. దాదాపు 1.1 కోట్ల మంది నివసించే ఆ నగరంలో కొద్ది వారాలుగా ఒక్క కరోనా కేసు కూడా వెలుగు చూడలేదు. అక్కడ కరోనా సంక్షోభం తొలనాళ్లలో కరోనా బారినపడ్డ అనేక మంది వైద్య సిబ్బందిలో హూ కూడా ఒకడని తెలుస్తోంది. అధికారిక లెక్కలేవీ లేకపోయినప్పటికీ అప్పట్లో అరడజను మంది వైద్య సిబ్బంది కరోనాకు బలయ్యారని కొన్ని స్వతంత్ర మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి.