కశ్మీర్ కంటే దారుణం: బెంగాల్‌పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-12-15T22:37:03+05:30 IST

బెంగాల్‌లో వీలైనంత తొందరలో కేంద్ర బలగాలను మోహరించాలని కోరింది. మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపధ్యంలో పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని

కశ్మీర్ కంటే దారుణం: బెంగాల్‌పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

కోల్‌కతా: జమ్మూ కశ్మీర్ కంటే కూడా బెంగాల్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడింది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాసింది. ఆ లేఖలో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై అనేక ఫిర్యాదులు చేసింది. అంతే కాకుండా బెంగాల్‌లో వీలైనంత తొందరలో కేంద్ర బలగాలను మోహరించాలని కోరింది. మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపధ్యంలో పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని, ఈ విషయమై సత్వర చర్యలు తీసుకోవాలని ఈసీకి రాసిన లేఖలో బీజేపీ పేర్కొంది.


‘‘పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని అత్యవసరంగా విధించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం వర్తిస్తుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అత్యంత పతనావస్థలో ఉన్నాయి. ప్రచారాలకు బెంగాల్ పోలీసుల నుంచి సహకారం పొందడం కష్టంగా ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మా ప్రచారానికి అడ్డంకులు సృష్టిస్తోంది. రాష్ట్రంలో వెంటనే కేంద్ర బలగాల్ని ఏర్పాటు చేయండి’’ అని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ లేఖ రాసింది.

Updated Date - 2020-12-15T22:37:03+05:30 IST