ఆ మూడు నల్లచట్టాల్ని చెత్తబుట్టలో పడేస్తాం: రాహుల్

ABN , First Publish Date - 2020-10-04T22:17:04+05:30 IST

కేంద్రం ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ..

ఆ మూడు నల్లచట్టాల్ని చెత్తబుట్టలో పడేస్తాం: రాహుల్

న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. పంజాబ్, హర్యానాలో ఆదివారం నుంచి ప్రారంభమైన మూడు రోజుల ట్రాక్టర్ ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వివాదాస్పద ఆర్డినెన్సులను రద్దు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.


పంజాబ్‌లోని మొగాలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆ చట్టాలను (వ్యవసాయ చట్టాలు) అమలు చేయాల్సిన అవసరం ఎమొచ్చింది? అదికూడా ఆదరాబాదరాగా ఎందుకు చేశారు? ఒకవేళ అమలు చేయాలనుకుంటే రాజ్యసభ, లోక్‌సభలో సమగ్ర చర్చ జరపాలి. సభలో అరమరికలు లేకుండా చర్చ ఎందుకు జరపలేదు? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రైతులంతా ఈ చట్టాల పట్ల సంతోషంగా ఉంటే దేశవ్యాప్తంగా వాళ్లెందుకు నిరసనలు చేస్తున్నారు? పంజాబ్‌లో ప్రతి ఒక్క రైతు ఆందోళన బాట ఎందుకు పట్టాడు? అని వరుస ప్రశ్నలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ మూడు నల్లచట్టాలను రద్దు చేసి, చెత్తబుట్టలో పడేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.


కనీస మద్దతు ధర తప్పనిసరి చేయకుండా పార్లమెంటులో ఆమోదించిన చట్టాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. పార్లమెంటు ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ మెగా ర్యాలీ నిర్వహించింది. కాగా, కొత్త వ్యవసాయ చట్టాలతో దళారుల ప్రమేయానికి చరమగీతం పాడామని, సొంత ప్రయోజనాలు ఆశించే కాంగ్రెస్ పార్టీ రైతులను తప్పుదారి పట్టిస్తోందని బీజేపీ అంటోంది.

Updated Date - 2020-10-04T22:17:04+05:30 IST