రెండోసారి కరోనా..? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమందంటే..

ABN , First Publish Date - 2020-04-15T00:00:31+05:30 IST

కరోనా నుంచి కోలుకున్న వారిలో వైరస్ నిరోధశక్తి అభివృద్ధి చెందుతుందా? రెండో సారి కరోనా దాడి జరిగితే వారు తట్టుకుంటారా? అనే ప్రశ్నలకు తమ వద్ద ప్రస్తుతానికైతే సరైన సమాధానం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు తెలిపారు

రెండోసారి కరోనా..? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమందంటే..

వాషింగ్టన్: కరోనా నుంచి కోలుకున్న వారిలో వైరస్ నిరోధకశక్తి అభివృద్ధి చెందుతుందా? రెండో సారి కరోనా దాడి జరిగితే వారు తట్టుకుంటారా? అనే ప్రశ్నలకు తమ వద్ద ప్రస్తుతానికైతే సమాధానం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరిలో కరోనా నిరోధక యాంటీబాడీలు(రోగనిరోధక శక్తి) అభివృద్ధి చెందుతాయని చెప్పలేమని వారు అన్నారు. ఈ విషయంపై మరింత అధ్యయనం జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ రయాన్ అన్నారు.  చైనాలో కొవిడ్ నుంచి కోలుకున్న వారిపై జరిగిన అధ్యయనం ప్రకారం కొందరిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందగా మరి కొందరి శరీరాల్లో వాటి జాడ కనిపించలేదని డబ్ల్యూహెచ్ఓకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త మరియా వాన్ కెర్‌కోవ్ తెలిపారు. కరోనాను జయించిన వారిలో కరోనా వ్యతిరేక రోగనిరోధక శక్తి ఎంతకాలం నిలిచి ఉంటుందనే దానిపై కూడా ప్రస్తుతానికి స్పష్టత లేదన్నారు. ఇక కొన్ని కేసుల్లో నిద్రాణంగా ఉన్న కరోనా వైరస్ పునరుత్తేజితమవడంపై కూడా మైక్ రయాన్ స్పందించారు. శరీరం నుంచి వైరస్ పూర్తిగా తొలగకపోవడం వంటి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుందని మైక్ రయాన్ తెలిపారు. 


Updated Date - 2020-04-15T00:00:31+05:30 IST