కరోనా చికిత్సకు ఏ ఔషధం మేలు!!
ABN , First Publish Date - 2020-07-19T07:07:49+05:30 IST
కరోనాకు వ్యాక్సిన్ వచ్చే దాకా ఇతర చికిత్సా మార్గాలు, ఔషధాలే శరణ్యం. ఈనేపథ్యంలో కొవిడ్-19 చికిత్సకు ఏ ఔషధం ఉపయోగపడుతుంది? ఏది ఉపయోగపడదు? అనే దానిపై స్పష్టతనిస్తూ బ్రిటన్ శాస్త్రవేత్తలు పలు అధ్యయన నివేదికలను విడుదల చేశారు...
![కరోనా చికిత్సకు ఏ ఔషధం మేలు!!](https://media.andhrajyothy.com/appimg/galleries/202007191498/07192020013743n51.jpg)
- రోగుల ప్రాణాలకు ‘డెక్సామెథసోన్’ రక్ష
- చికిత్సా కాలం తగ్గిస్తున్న ‘రెమ్డెసివిర్’
లండన్, జూలై 18: కరోనాకు వ్యాక్సిన్ వచ్చే దాకా ఇతర చికిత్సా మార్గాలు, ఔషధాలే శరణ్యం. ఈనేపథ్యంలో కొవిడ్-19 చికిత్సకు ఏ ఔషధం ఉపయోగపడుతుంది? ఏది ఉపయోగపడదు? అనే దానిపై స్పష్టతనిస్తూ బ్రిటన్ శాస్త్రవేత్తలు పలు అధ్యయన నివేదికలను విడుదల చేశారు. ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తల నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో అతిచౌక స్టీరాయిడ్ డెక్సామెథసోన్ కొవిడ్ రోగులపై ప్రభావవంతంగా పనిచేస్తోందని తేలింది. అధ్యయనంలో భాగంగా 2,104 మంది రోగులకు స్టీరాయిడ్ను.. మరో 4,321 మందికి సాధారణ చికిత్స అందించారు. అయితే డెక్సామెథసోన్ను వాడిన వారిలో 29ు మంది మాత్రమే మరణించగా.. సాధారణ ఔషధాలతో చికిత్స పొందిన వారిలో 41 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆక్సిజన్ సహాయం పొందుతున్న రోగుల్లో 36శాతం మంది ప్రాణాలను డెక్సామెథసోన్ కాపాడిందని నివేదికలో ప్రస్తావించారు. తేలికపాటి లక్షణాలు కలిగిన వారిపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిందని వెల్లడించారు. దీంతోపాటు మలేరియా నిరోధక ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ను తేలికపాటి లక్షణాలు కలిగిన రోగులపై పరీక్షించగా.. అది పెద్దగా పనిచేయడం లేదని స్పష్టమైంది. మరోవైపు యాంటీ వైరల్ ఔషధం రెమ్డెసివిర్ కరోనా రోగుల చికిత్సా కాలాన్ని సగటున నాలుగు రోజులు తగ్గించిందని పేర్కొన్నారు.