పెళ్లి బడ్జెట్ 500 కోట్లు!
ABN , First Publish Date - 2020-03-02T07:31:54+05:30 IST
ర్ణాటక మంత్రి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహంలో సుమారు రూ.500 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిసింది. ఈనెల 5న బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్లో పెళ్లి. లక్షలాది మందికి ఆహ్వాన పత్రికలతోపాటు యాలకులు, కుంకుమ బాక్సులూ...

- 5న కర్ణాటక మంత్రి శ్రీరాములు కుమార్తె వివాహం
బెంగళూరు, మార్చి 1: కర్ణాటక మంత్రి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహంలో సుమారు రూ.500 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిసింది. ఈనెల 5న బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్లో పెళ్లి. లక్షలాది మందికి ఆహ్వాన పత్రికలతోపాటు యాలకులు, కుంకుమ బాక్సులూ పంపినట్టు తెలిసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలను ఆహ్వానించేందుకు శ్రీరాములు ఢిల్లీ వెళ్లారు. పెళ్లికూతురు దుస్తులను ఇటీవల బాలీవుడ్ నటి దీపికా పదుకొన్ పెళ్లిలో మేకప్ తదితరాలు నిర్వహించిన శాండల్వుడ్ డిజైనర్ సానియా సర్ధారియాతో డిజైన్ చేయించినట్టు సమాచారం.
వెడ్డింగ్ జర్నల్స్ ఆఫ్ ఇండియా ఫేం జయరామన్ పిళ్లై ఫొటోగ్రఫీ చేయనున్నారు. ఈనెల 3న బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో నిర్వహించే మెహందీ కార్యక్రమానికి బాలీవుడ్, శాండల్వుడ్ నటీనటులతోపాటు పార్టీలకు అతీతంగా ప్రముఖ రాజకీయ నాయకులూ హాజరుకానున్నట్టు తెలిసింది. వారి కోసం బెంగళూరు వ్యాప్తంగా ఫైవ్స్టార్ హోటళ్లలో గదులు బుక్ చేసినట్టు సమాచారం. నల్లధనాన్ని వెలికితీసేందుకు 2016లో ప్రధాని మోదీ పెద్దనోట్లను రద్దు చేసిన సమయంలోనే బళ్లారి మైనింగ్ దిగ్గజం గాలి జనార్ధన్రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం అంగరంగ వైభవంగా సుమారు రూ.550 కోట్లతో నిర్వహించారు. యునెస్కో గుర్తించిన చారిత్రక కట్టడాల జాబితాలోని హంపి విట్టల ఆలయ సెట్టింగ్ను కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. గాలి జనార్ధన్రెడ్డి అనుచరుడైన శ్రీరాములు సైతం కుమార్తె వివాహాన్ని దాదాపు అంతే ఘనంగా నిర్వహించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
