లాక్డౌన్ ఎఫెక్ట్: పెరిగిన గంగా, యమునా జలాల నాణ్యత
ABN , First Publish Date - 2020-04-05T23:53:47+05:30 IST
నదీ జలాల ప్రక్షాళనకు దేశవ్యాప్తి లాక్డౌన్ ఒక వరంగా పరిణమించిందా? 21 రోజుల లాక్డౌన్ కాలంలో గంగా, యమునా నదీ జలాల నాణ్యత ..
న్యూఢిల్లీ: నదీ జలాల ప్రక్షాళనకు దేశవ్యాప్తి లాక్డౌన్ ఒక వరంగా పరిణమించిందా? 21 రోజుల లాక్డౌన్ కాలంలో గంగా, యమునా నదీ జలాల నాణ్యత మెరుగుపడిందా? అవుననే చెబుతున్నారు నిపుణులు. దేశవ్యాప్త లాక్డౌన్లో భాగంగా ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు పారిశ్రామిక సంస్థలు ఎక్కడికక్కడే మూతపడ్డాయి. దీంతో ఫ్యాక్టరీల నుంచి నదీ జలాల్లోకి విడిచిపెట్టే పారిశ్రామిక వ్యర్థ పదార్ధాల విడుదల కూడా ఆగిపోయి యమునా నదీజలాల నాణ్యత మెరుగైనట్టు ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్ రాఘవ్ చద్దా తెలిపారు.
'అనేక పరిశ్రమలు, కార్యాలయాలు దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా మూతపడ్డాయి. దీంతో యమునా జలాలు కొద్దిరోజులుగా స్వచ్ఛతతో కనిపిస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు నిలిచిపోవడం తప్పనిసరిగా నీటి నాణ్యతపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. నీటి నాణ్యతా ప్రమాణాలు ఎంత శాతం మెరుగయ్యాయనే దానిపై పరీక్షలు జరుపుతాం' అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కూడా అయిన చద్దా మీడియాకు తెలిపారు.
యుమునా జలాలు తప్పనిసరిగా శుద్ధి చేయగలమని తమ పార్టీ గట్టి నమ్మకంతో ఉందని, ప్రజల సహకారంతో భవిష్యత్తులో కూడా జలాల నాణ్యతా ప్రమాణాలు పెరిగేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం, ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తే చాలా తేలిగ్గా యమునా జలాల పక్షాళన జరుగుతుందనే నమ్మకం తమకు ఇప్పుడు (లాక్డౌన్ సమయంలో) మరింత బలపడిందని చెప్పారు. జలాల నాణ్యతపై త్వరలోనే ల్యాబ్ పరీక్షలు పూర్తి చేసి ఏమేరకు మెరుగైందనే గణాంకాలను వెల్లడి చేస్తామన్నారు.
40 నుంచి 50 శాతం పెరిగిన గంగా జలాల నాణ్యత
కాగా, మార్చి 24వ తేదీన లాక్డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకూ పవిత్ర గంగా నదీ జలాల్లో నాణ్యత 40 నుంచి 50 శాతం వరకూ మెరుగైనట్టు ఐఐడీ-బీహెచ్యూలోని కెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్.. డాక్టర్ పీకే మిశ్రా తెలిపారు. గంగా నదిలోకి వచ్చే కాలుష్యంలో పదో వంతు పరిశ్రమల నుంచే వస్తుందని, లాక్డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడటంతో 40 నుంచి 50 శాతం జలాల ప్రక్షాళనను మనం చూడొచ్చని అన్నారు.
మార్చి 15, 16 తేదీల్లో గంగ ప్రవహించే ప్రాంతాల్లో ఎక్కడైతే వర్షాలు పడ్డాయో అక్కడ నీటి ప్రవాహం కూడా పెరిగిందని, దీంతో శుద్ధతా సామర్థ్యం కూడా మెరుగైందని ఆయన విశ్లేషించారు. లాక్డౌన్కు ముందు, లాక్డౌన్ మొదలైన మార్చి 24 తర్వాత పరిస్థితిని గమనించినప్పుడు తప్పనిసరిగా జలాల నాణ్యత గణనీయమైన స్థాయిలో మెరుగుపడటం కనిపిస్తుందని డాక్టర్ మిశ్రా అన్నారు.