ఓటర్ ఐడీ కార్డులు కూడా డిజిటల్ కాబోతున్నాయ్!
ABN , First Publish Date - 2020-12-11T17:13:57+05:30 IST
ఓటర్ గుర్తింపు కార్డులు కూడా డిజిటైజేషన్ బాట పట్టబోతున్నాయి.
న్యూఢిల్లీ : ఓటర్ గుర్తింపు కార్డులు కూడా డిజిటైజేషన్ బాట పట్టబోతున్నాయి. ఆధార్ కార్డు తరహాలోనే ఓటర్ ఐడీ కార్డులను కూడా డిజిటల్ రూపంలో అందజేయబోతున్నారు. వచ్చే ఏడాది 5 రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికల జరగబోతున్న సమయంలో, అంతకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు. ఎన్నికల కమిషన్ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.
ఈ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఓటరు గుర్తింపు కార్డులను డిజిటైజేషన్ చేయాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రయత్నిస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే, ఓటర్లు తమ ఐడీ కార్డులను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కలుగుతుంది. కొత్తగా నమోదయ్యే ఓటర్ల ఐడీ కార్డులు ఆటోమేటిక్గానే జనరేట్ అవుతాయి. ప్రస్తుత ఓటర్లు ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా కొన్ని లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత, గుర్తింపు కార్డులు జనరేట్ అవుతాయి.
2021 ఏప్రిల్, మే నెలల్లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయి.