కరోనా ఎఫెక్ట్: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
ABN , First Publish Date - 2020-03-16T20:21:15+05:30 IST
కోవిడ్-19 మహమ్మారి రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే...
న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ‘‘వర్చువల్ కోర్టులను’’ అందుబాటులోకి తీసుకురానున్నట్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. వచ్చే వారం నుంచి న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను వాదించవచ్చునని ఆయన తెలిపారు. ‘‘కోర్టులు అనారోగ్యాన్ని వ్యాప్తిచేసే ప్రదేశాలుగా ఉండరాదన్నదే మా ఉద్ధేశ్యం..’’ అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఇప్పటికే 143 దేశాలను చుట్టేసిన కరోనా వైరస్ కారణంగా... ప్రపంచ వ్యాప్తంగా 5 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే కోర్టు రూముల్లోకి పరిమిత సంఖ్యలో మాత్రమే లాయర్లు, వ్యాజ్యకారులు, పాత్రికేయులకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు బయట ధర్మల్ స్క్రీనింగ్ సైతం ఏర్పాటు చేయడంతో ప్రవేశ ద్వారాల వద్ద పెద్ద సంఖ్యలో క్యూలైన్లు కనిపించాయి.
కాగా కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని హైకోర్టులతోనూ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే తరచూ సమీక్షిస్తున్నట్టు జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. ఇకపై కేసులను డిజిటల్ రూపంలో ఫైల్ చేయడం, వర్చువల్ కోర్టుల ద్వారా విచారణ జరపడం తదితర చర్యలు తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకోసం న్యాయవాదులు, వ్యాజ్యకారులు, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కోర్టులకు సహకరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కరోనా విషయమై ఇప్పటికే అపొల్లో, ఫోర్టిస్ ఆస్పత్రులకు చెందిన వైద్య నిపుణులను సుప్రీంకోర్టు సంప్రదించినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడరాదంటూ ఈ నెల 5న ప్రభుత్వం సూచించిన నేపధ్యంలో... ప్రస్తుతం అత్యవసర కేసులను మాత్రమే విచారించాలని సుప్రీంకోర్టు గతవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.