'రాజీవ్ ఖేల్ రత్న' వెనక్కిచ్చేస్తా: విజేందర్ సింగ్

ABN , First Publish Date - 2020-12-06T21:12:50+05:30 IST

కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోకుంటే తనకు ఇచ్చిన రాజీవ్ గాంధీ ఖేల్ ..

'రాజీవ్ ఖేల్ రత్న' వెనక్కిచ్చేస్తా: విజేందర్ సింగ్

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోకుంటే తనకు ఇచ్చిన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును వాపసు చేస్తానని బాక్సర్ విజేందర్ సింగ్ ప్రకటించారు. సింఘు సరిహద్దు (హర్యానా-ఢిల్లీ సరిహద్దు) వద్ద రైతులు జరుపుతున్న ఆందోళనల్లో ఆదివారంనాడు ఆయన పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మా పెద్ద సోదరులైన పంజాబ్ రైతులు ఇక్కడ ఉండటంతో తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు. ప్రభుత్వం ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోకుంటే తనకిచ్చిన అత్యున్నత క్రీడా అవార్డయిన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును వాపసు చేస్తానని చెప్పారు. రైతులు మధ్య ఐక్యత అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ చెక్కుచెదరదని అన్నారు.


విజేందర్ సింగ్ 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. రైతు ఆందోళనలు కొనసాగుతుండటంతో వారికి మద్దతుగా జాతీయ బాక్సింగ్ కోచ్ గుర్‌ప్రకాష్ సంధు తనకు ప్రదానం చేసిన ద్రోణాచార్య అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించారు.


అవార్డుల వాపస్ ..

రైతులను భారత ప్రభుత్వం వంచించిందంటూ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ (సాద్) నేత ప్రకాష్ సింగ్ బాదల్ తనకు ప్రభుత్వం ఇచ్చిన 'పద్మవిభూషణ్' అవార్డును డిసెంబర్ 3న తిరిగి ఇచ్చేశారు. 4వ తేదీన రైతులకు సంఘీభావంగా శిరోమణి అకాలీ దళ్ (డెమోక్రటిక్) చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా తన పద్మభూషణ్ అవార్డును వాపసు ఇచ్చారు. ఇదే రోజు, పంజాబ్‌కు చెందిన భారతీయ సాహిత్య అకాడమీ అవార్డు విజేతలైన డాక్టర్ మోహన్ జిత్, డాక్టర్ జస్వీందర్ సింగ్, పంజాబీ ట్రిబ్యూన్ ఎడిటర్ స్వరాజ్‌బీర్‌లు తమ అవార్డులను వదులుకున్నారు.

Updated Date - 2020-12-06T21:12:50+05:30 IST