కంచిబొట్ల మృతికి సంతాపం తెలిపిన ఉపరాష్ట్రపతి
ABN , First Publish Date - 2020-04-08T18:43:23+05:30 IST
ప్రఖ్యాత ఇండో అమెరికా జర్నలిస్ట్ కంచిబొట్ల బ్రహ్మానందం మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: ప్రఖ్యాత ఇండో అమెరికా జర్నలిస్ట్ కంచిబొట్ల బ్రహ్మానందం మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా కంచిబొట్ల మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.
యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాలో కరెస్పాండెంట్గా పని చేస్తున్న బ్రహ్మ కంచిబోట్ల(66) కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయారు. తొమ్మిది రోజులపాటు ఈ మహమ్మారితో పోరాడిన బ్రహ్మ చివరకు ప్రాణాలొదిలారు. యూఎస్లో 28 ఏళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్న ఆయన చివరకు కరోనా కాటుకు బలి అయ్యారు. బ్రహ్మ కుమారుడు సుడామా కంచిబోట్ల మాట్లాడుతూ ప్రస్తుతం న్యూయార్క్లో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా తండ్రి ఆఖరి చూపుకు నోచుకుంటామో లేదో అని వాపోయాడు. తండ్రి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇస్తారనే నమ్మకం కూడా లేదన్నాడు. మార్చి 23న తొలిసారి బ్రహ్మకు కరోనా లక్షణాలు బయటపడ్డాయని, దాంతో ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉన్నారని తెలిపాడు. కానీ, మార్చి 28 నాటికి తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో అదే రోజు లాంగ్ ఐస్లాండ్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించామని సుడామా తెలిపాడు. మార్చి 31న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటిలేటర్పైకి మార్చారని, ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆయన గుండెపోటుకు గురై చనిపోయినట్లు చెప్పాడు. మృతుడు బ్రహ్మకు కుమారుడు సుడామాతో పాటు కూతురు సుజానా, భార్య అంజనా ఉన్నారు.