కోర్టుల వ్యాఖ్యలు పరిధులు దాటుతున్నాయ్...
ABN , First Publish Date - 2020-11-26T09:45:29+05:30 IST
రాజ్యాంగానికి లోబడే న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ విధులకు నిర్వహించాల్సి ఉన్నదని, ఈ మూడు వ్యవస్థలు తమ పరిధిలో తాము పనిచేస్తేనే సమన్వయం ఏర్పడుతుందని ఉపరాష్ట్రపతి

సభాపతుల సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య
న్యూఢిల్లీ, నవంబర్ 25 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగానికి లోబడే న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ విధులకు నిర్వహించాల్సి ఉన్నదని, ఈ మూడు వ్యవస్థలు తమ పరిధిలో తాము పనిచేస్తేనే సమన్వయం ఏర్పడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారత రాజ్యాంగానికి అతీతం ఏ వ్యవస్థా కాదని బుధవారం గుజరాత్లోని కెవాడియాలో 80వ అఖిల భారత సభాపతుల సదస్సులో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. కోర్టులు ఒక్కో సందర్భంలో చేస్తున్న వ్యాఖ్యలు అవి పరిధి దాటి ప్రవర్తిస్తున్నాయా అన్న అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయని ఆయన అనడం విశేషం.
’’స్వాతంత్య్రం వచ్చాక సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు అనేక కీలక తీర్పులిచ్చాయి. కానీ ఈ క్రమంలో అవి తమ పరిధి దాటి కార్యనిర్వాహక, శాసనవ్యవస్థ విధుల్లోకి జొరబడుతున్నాయన్న ఆందోళనలను రేకెత్తించాయి. కొన్ని అంశాలను ప్రభుత్వ శాఖలకే వదిలేయడం మంచిదేమోనని, కోర్టుల జోక్యం అనవసరమన్న చర్చ కూడా సాగింది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడం, పోలీసు విచారణపై పర్యవేక్షణ, జడ్డీల నియామకాల్లో కార్యనిర్వాహక వ్యవస్థను కాదని కొలీజియాలే నిర్ణయా లు తీసుకోవడం, జాతీయ న్యాయ నియామక సంస్థ ఏర్పాటును తిరస్కరించడం వంటి సందర్బాలను ఆయన ప్రస్తావించారు.