అటల్ టన్నెల్ ప్రారంభం కావడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య హర్షం
ABN , First Publish Date - 2020-10-04T03:41:19+05:30 IST
ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన అటల్ టన్నెల్ ప్రధాని మోదీ చేతుల మీదుగా...

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన అటల్ టన్నెల్ ప్రధాని మోదీ చేతుల మీదుగా శనివారం ప్రారంభం కావడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక చారిత్రక దినమని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్లో ట్వీట్ చేసింది. 9.02 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం లద్దాఖ్కు ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు, సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందని ట్వీట్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన అటల్ టన్నెల్ను ప్రధాని మోదీ నేడు ప్రారంభించారు. రూ.3,500 కోట్ల వ్యయంతో 9.02 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ టన్నెల్ సముద్ర మట్టానికి 10,213 అడుగుల ఎత్తున ఉంది.
ఈ సొరంగం వల్ల మనాలీ నుంచి లద్దాఖ్లోని లెహ్ వరకు 7 గంటల రోడ్డు ప్రయాణ సమయం, 45 కిలోమీటర్ల దూరం తగ్గుతాయి. అన్నిటినీ మించి ఎంత మంచు కురిసినా రోడ్డును మూసివేయాల్సిన పని ఉండదు. లద్దాఖ్, అక్సాయ్ చిన్ సరిహద్దుల్లో మోహరించిన భారత సైన్యానికి వ్యూహాత్మక (ఆయుధ/ఆహార) సరఫరాలకు అవకాశం ఏర్పడింది. మనాలీ నుంచి లాహోల్స్పీతి వ్యాలీ వరకు నిర్మించిన ఈ సొరంగం వల్ల శీతాకాలంతో పాటు అన్ని కాలాల్లో ఏడాది పొడవునా ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలు కలిగింది. ఈ సొరంగం పొడవు 9.02 కి.మీ., వెడల్పు 8 మీటర్లు. ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ కోసం ప్రతీ 150 మీటర్లకు ఒక టెలిఫోన్ ఏర్పాటు చేశారు. ప్రతీ కిలోమీటర్కు గాలి నాణ్యతను కొలిచే పరికరం ఉంటుంది.