హాథ్రాస్ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సీఎం యోగి ఆదేశాలు
ABN , First Publish Date - 2020-10-04T02:31:44+05:30 IST
హాథ్రస్ దళిత బాలిక గ్యాంగ్రేప్, హత్య ఘటనపై, దాన్ని కప్పిపుచ్చేందుకు...
![హాథ్రాస్ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సీఎం యోగి ఆదేశాలు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020100308561364/10032020210122n56.jpg)
ఉత్తరప్రదేశ్: హాథ్రస్ దళిత బాలిక గ్యాంగ్రేప్, హత్య ఘటనపై, దాన్ని కప్పిపుచ్చేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ హాథ్రస్ బాధితురాలి కేసుకు సంబంధించి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సీబీఐ విచారణకు సీఎం యోగి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. బాధితురాలి కుటుంబాన్ని అధికారులు శనివారం నాడు కలుసుకున్నారు. అనంతరం.. సీఎం యోగి ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.
ఇప్పటికే హాథ్రస్ ఘటనపై దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) శుక్రవారం ముఖ్యమంత్రి యోగికి ప్రాథమిక నివేదికను సమర్పించింది. సిట్ సూచనల మేరకే ముఖ్యమంత్రి జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్లను విధుల నుంచి సస్పెండ్ చేశారు. వారందరికీ నార్కో ఎనాలిసిస్, పాలిగ్రాఫ్ పరీక్షలు చేయాలని ఆదేశించారు. దాంతో పాటు కొత్త ఎస్పీగా వినీత్ జైశ్వాల్ను నియమించారు.